మూడోసారి మంత్రివర్గ విస్తరణ
ఖాట్మండు: నేపాల్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. పదవిలోకి వచ్చిన అల్పకాలంలోనే ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ తన కేబినెట్ను మూడుసార్లు పునర్వ్యవస్తీకరించారు. పది పార్టీల పాలక పక్షం కావడంతో మంత్రిత్వశాఖలపై చివరి వరకు సాగిన తర్జనభర్జన తర్వాత 11మంది కొత్త మంత్రులకు స్థానం కల్పించారు. ఇన్నిసార్లు కేబినెట్లో మార్పులు, చేర్పులు చేసినప్పటికీ అది పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదు. కాగా, షీతల్ నివాస్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం అధ్యక్షుడు రామచంద్రపౌడెల్ అధ్వర్యంలో జరిగింది. కొత్త కేబినెట్లో ఇద్దరు ఉప ప్రధానులు పూర్ణ బహదూర్ ఖడ్కా (నేపాలీ కాంగ్రెస్), నారాయణ్ కాజి శ్రేష్ఠ (సీపీఎన్మావోయిస్ట్ సెంటర్), 13 మంది మంత్రులు, ఒక సహాయ మంత్రి ఉన్నారు. ఖడ్కాకు ఉప ప్రధాని పదవితో పాటు రక్షణ మంత్రిత్వశాఖను కట్టబెట్టారు. శ్రేష్ఠకు హోంశాఖ అప్పగించారు. నేపాలీ కాంగ్రెస్ నలుగురు మంత్రులకు కీలక శాఖలు దక్కాయి. ప్రకాశ్ శరణ్మహత్కు ఆర్థిక శాఖ, రమేశ్ రిజల్కు పరిశ్రమలు, వాణిజ్య శాఖ, సీతాగురుంగ్కు పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు స్వీకరించారు. అలాగే సీపీఎన్
యునైటెడ్ సెంటర్కు చెందిన ఇద్దరు మంత్రులలో వేడురాం భూషల్కు వ్యవసాయ శాఖ, ప్రకాశ్ జ్వాలాకు రవాణా శాఖ లభించగా విదేశాంగ, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు తదితర శాఖలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.