ఏథెన్స్ ర్యాలీలో కేకేఈ నినాదం
ఏథెన్స్: గ్రీస్లో ఈనెల 21న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) ప్రచార ర్యాలీలను పెద్దఎత్తున నిర్వహిస్తోంది. రాజధాని ఏథెన్స్లో నిర్వహించిన ప్రదర్శనలో ప్రజలే ప్రజలను కాపాడుకోగలరని నినాదమిచ్చింది. ఏథెన్స్లోని సింటాగ్మా స్క్వేర్లో జరిగిన ప్రదర్శనలో వేలాది మంది కార్యకర్తలు, అన్ని వయస్సుల మహిళలు, పురుషులు పాల్గొన్నారు. ‘కేకేఈ ముందుంటే ప్రజలే ప్రజలను కాపాడుకోగలరు’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి దిమిత్రీస్ కౌట్సోంబస్ ర్యాలీనుద్దేశించి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల లక్షలాది మంది వర్కర్లు జీఎస్ఈఈ, ఏడీఈడీవైలో కేకేఈని రెండవ స్థానంలో నిలబెట్టారని, దేశ కార్మికశక్తి అగ్రనాయకత్వాన్ని ఏథెన్స్ కార్మికులు కట్టబెట్టారన్నారు. కేకేఈ పోరాటాల్లో కలిసివచ్చిన పింఛన్దారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, టీచర్లు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉజ్వల భవితకు మార్గం సుగమం చేద్దామని దిమిత్రీస్ ఉద్ఘాటించారు. కేకేఈ బలం పెరిగితే గ్రీస్తో పాటు ఫ్రాన్స్లో జర్మనీలో పోరాటాలు చేస్తున్న కార్మికులకు బలం చేకూరుతుందన్నారు. నిజాయితీ, సుస్థిర, ఉద్యమ పథంలో ముందుకు సాగుతూ మెరుగైన భవిత సాధిద్దామని పిలుపునిచ్చారు.