Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భూకంపం శిథిలాల కింద శిశువు జననం.. తల్లి మృతి, బిడ్డ క్షేమం

భూకంపం శిథిలాల కింద చిక్కుకున్న ఓ నిండు గర్భిణి.. ఆ శిథిలాల కిందే బిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ప్రాణాలు పోయాయి. సిరియాలోని అలెప్పోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

భూకంపం శిథిలాల కింద శిశువుకు జన్మనిచ్చిన తల్లి
ఎటు చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలు. శిథిలాల కింద చిక్కుకొని బాధితుల ఆర్తనాదాలు. అలాంటి బాధితుల్లో పురిటినొప్పులతో తల్లడిల్లిన ఓ తల్లి ఆర్తనాదాలు వినిపించాయి. అటు వైపు పరుగెత్తికెళ్లి, అడ్డొచ్చిన రాయీ రప్పను పక్కకు తొలగిస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాసేపటి తర్వాత శిశువు ఏడుపు వినిపించింది. శిథిలాలన్నీ పక్కకు తొలగించి, ఆ శిశువును రక్షించి ఆస్పత్రికి తరలించారు. తల్లిని కాపాడేందుకు ప్రయత్నిస్తే చలనం లేదు. బిడ్డకు జన్మనిచ్చి ఆమె మృతి చెందింది. కడుపులో పెరుగుతున్న చిన్నారిని సురక్షితంగా నేల మీదకి చేర్చేందుకు శక్తినంతా కూడదీసుకొని, శిథిలాలను తోసుకొని ప్రసవించిన ఆ తల్లి.. ఇక వల్ల కాదంటూ తన సత్తువ చేతులెత్తేయగా, ప్రాణాలు విడిచింది.

సిరియాలో భూకంపం మిగిల్చిన తీవ్ర విషాదమిది. సిరియాలోని అలెప్పోలో శిథిలాల తొలగింపు క్రమంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. శిథిలాల కింద నుంచి బయటకు తీసుకొచ్చిన ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, శిథిలాల మధ్య ఈ బిడ్డ జన్మించిన తీరు మాత్రం ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది.

సిరియాలో భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన నగరాల్లో అలెప్పో ఒకటి. టర్కీ, సిరియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా విషాద దృశ్యాలు, కన్నీటి ధారలే కనిపిస్తున్నాయి. సోమవారం (ఫిబ్రవరి 6) 10 గంటల తేడాతో రెండుసార్లు సంభవించిన రెండు బలమైన భూకంపాల దాటికి ఈ రెండు దేశాల్లో 5 వేల మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనధికారికంగా 20 వేలకు పైగా మరణాలు ఉండవచ్చని తెలుస్తోంది.

టర్కీలో భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరించిన పరిశోధకుడు

కుప్పకూలిన భవనాలు వేల సంఖ్యలో ఉండటంతో అందరికీ సాయం అందట్లేదు. తమ వారిని రక్షించుకోవాలనే తాపత్రయంతో భవనాల వద్ద రోదిస్తూ, చేతులతో శిథిలాలను తొలగిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నిలువ నీడ కోల్పోయిన భూకంప బాధితులు.. పొగమంచు, చలి బారికి తట్టుకోలేక దొరికన చెత్త, కాగితం ముక్కలు పోగు చేసుకొని మంటలు వేసుకొని చలి కాచుకుంటున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక.. తమ వాళ్ల జాడ తెలియక, వేలాది మంది సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంత విషాదం మధ్య మళ్లీ మళ్లీ భూ ప్రకంపనలు చోటుచేసుకుంటుడటం మరింత ఆందోళన కల్గిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img