లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీపడుతున్న రిషి సునాక్, లిజ్ ట్రస్ల మధ్య పోరు చరమాంకానికి చేరుకుంది. వచ్చే వారం నుంచి పార్టీ ఓటర్లకు బ్యాలెట్పత్రాలు పంపిణీకానున్నాయి. ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఆయన క్యాబినెట్లో మంత్రులుగా పని చేసిన రిషి సునాక్, లిజ్ ట్రస్ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. తొలుత రిషి సునాక్, లిజ్ ట్రస్ల మధ్య విజయావకాశాలు 60-40 గా నిలిచాయి. కానీ, క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో 90 శాతం మంది లిజ్ ట్రస్ను విశ్వసిస్తున్నారని స్మార్కెట్ అనే సంస్థ అంచనాలో తేలింది. ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు పాల్గొన్న టీవీ చానెళ్ల చర్చాగోష్టుల్లో రిషి సునాక్ను లిజ్ ట్రస్ వెనక్కు నెట్టేశారని తెలుస్తున్నది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను ఆకట్టుకునే రీతిలో లిజ్ ట్రస్ ప్రసంగాలు ఉన్నాయని సమాచారం. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో మెజారిటీ సభ్యుల విశ్వాసాన్ని చూరగొన్న రిషి సునాక్.. పార్టీ సభ్యుల మదిని గెలుచుకోవడంలో వెనుకబడినట్లు స్మార్కెట్స్ పొలిటికల్ మార్కెట్స్ అధిపతి మాథ్యూ షాడిక్ చెప్పారు. కేవలం 10 శాతం మంది మద్దతు మాత్రమే రిషి సునాక్కు లభిస్తుందన్నారు. సుమారు 1.75 లక్షల మంది పార్టీ సభ్యులకు ఓటు హక్కు ఉందని తెలుస్తున్నది. వీరిలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించిన వారే బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారు.సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించవలసి ఉంటుంది. సెప్టెంబరు 5న ఫలితాలు వెలువడతాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో జరిగిన టీవీ చానెళ్ల చర్చాగోష్టుల్లో పాల్గొన్న రిషి సునాక్, లిజ్ ట్రస్.. సాధారణ సభ్యుల మద్దతు సంపాదించుకునేందుకు ఆరు వారాలు దేశమంతా పర్యటిస్తారు. వచ్చేవారం బ్యాలెట్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తమ బ్యాలెట్ పత్రాలను సమర్పించాల్సి ఉంది. సెప్టెంబర్ ఐదో తేదీన తుది ఫలితాలు వెలువడతాయి.