తాలిబన్లకు హమీద్ కర్జాయ్ సలహా
కాబూల్ : ప్రపంచ గుర్తింపు పొందాలంటే ముందు దేశ ప్రజల ప్రేమను చూరగొనాలని తాలిబన్ పాలకులకు అఫ్గానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సూచించారు. ఎన్నికల ద్వారా లేదా లోయ జిర్గా (జాతీయ మహాసభ) నిర్వహించడం ద్వారా జాతీయ చట్టబద్ధత పొందాలని తాలిబాన్లకు సలహా ఇచ్చారు. ఇదే సమయంలో తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని మానుకోవాలని పాకిస్తాన్కు హితవు పలికారు. వాయిస్ ఆఫ్ అమెరికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హమీద్ కర్జాయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు టోలో న్యూస్ వార్తను ప్రచురించింది. ఇస్లామిక్ ఎమిరేట్ దేశాన్ని నడపడానికి ఒక రాజ్యాంగాన్ని కలిగి ఉండటం అవసరమని హమీద్ కర్జాయ్ స్పష్టం చేశారు. ‘జాతీయ చట్టబద్ధత, అంతర్జాతీయ గుర్తింపు రెండూ ముఖ్యమైనవే. అయితే, జాతీయ మహాసభ ద్వారా జాతీయ చట్టబద్ధతకు మార్గం సుగమం చేయడం లేదా అఫ్గానిస్తాన్ రాజ్యాంగాన్ని అమలు చేయడం వంటి పనులను ముందు చేపట్టాలి. జాతీయ చట్టబద్ధతను ఎన్నికల ద్వారా లేదా జాతీయ మహాసభ ద్వారా సాధించవచ్చు’ అని కర్జాయ్ పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకోరాదని కర్జాయ్ అన్నారు. పాకిస్తాన్ తమకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు మాట్లాడుతోందని, పాక్ తమ ప్రతినిధి కాదని తేల్చిచెప్పారు.