రష్యాపై ఉక్రెయిన్ విజయం తధ్యం
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో జెలెన్స్కీ
కీవ్: ‘ఇది 2023 సంవత్సరం. ఉక్రెయిన్లో యుద్ధం ఇంకా ముగియలేదుగానీ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. గెలుపు ఎవరిదో తెలుస్తోంది’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. మూడవ ప్రపంచ యుద్ధం జరగబోదని ఆయన తేల్చిచెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రెండవ ప్రపంచ యుద్ధం అంతకుమించి ప్రాణనష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం జరగదు. ఇదేమీ ట్రైలాజి (త్రివిధతర్కము) కాదు’ అని జెలెన్స్కీ అన్నారు. హాలీవుడ్కు సంబంధించి ప్రతిష్టాత్మక గోల్టెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వర్చువల్గా ప్రసంగించారు. స్వేచ్ఛా ప్రపంచం సాయంతో తమ భూభాగాన్ని రష్యా వశం కానివ్వబోమని, రష్యాను ఉక్రెయిన్ నిలువరిస్తుందని ఆయన విశ్వాసంగా చెప్పారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ప్రారంభైన సమయం ప్రత్యేకమైనదిగా వర్ణించారు. అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకొనగా గెలుపు ఎవరిదో తెలిసిందిగానీ ఆ తర్వాత కూడా పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. 1943లో అద్భుత ప్రదర్శకులను సన్మానించేందుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు తెరపైకొచ్చాయని జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ స్వాతంత్య్రానికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, జీవిక హక్కు, ప్రేమించే హక్కు కోసం ఐక్యంగా పోరాడుతున్నామని చెప్పారు. ఉక్రెయిన్ విజయం తథ్యమని జెలెన్స్కీ ప్రకటించగా ప్రేక్షకులంతా హర్షధ్వనులతో అభినందించారు. ‘మనమంతా కలిసికట్టుగా ఉక్రెయిన్ విజయాన్ని నిజం చేస్తాం… ఆ రోజు మీరంతా మా వెంటే ఉంటారని భావిస్తున్నా. ఉక్రెయిన్ విజయం సాధించే రోజు ‘స్వావా ఉక్రెయిని’ అంటూ తన ప్రసంగాన్ని జెలెన్స్కీ ముగించారు. అయితే అమెరికా`నాటో నుంచి 3.75 బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని ఉక్రెయిన్ అందుకున్న వారం తర్వాత గోల్టెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమంలో జెలెన్స్కీ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.