లండన్: డెబ్బై ఏళ్లపాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 గతేడాది సెప్టెంబర్లో కన్నుమూయడంతో తదుపరి రాజుగా ఛార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 6వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం జరగనుంది. ఈ మేరకు రాజవంశం అధికారికంగా ప్రకటించింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబే లో మే 6వ తేదీన బ్రిటన్ రాజు ఛార్లెస్ పట్టాభిషేక కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించనున్నట్లు వెల్లడిరచింది. ఆదే సమయంలో క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అనంతరం ఆ తర్వాతి రోజున విండ్సర్ క్యాజిల్లో కూడా పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్య ప్రజలను కూడా అనుమతించనున్నారు. ఛార్లెస్-3, కెమిల్లా దంపతుల అధికారికంగా జరగనున్న ఈ పట్టాభిషేక మహోత్సవానికి 2వేల మందిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాగా పట్టాభిషేకం కార్యక్రమంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించకూడదని రాజవంశం నిర్ణయించింది. వలస రాజ్యాల పాలనకు గుర్తుగా బ్రిటన్ రాచకుటుంబం చేతిలో ఉన్న వివాదాస్పద కోహినూర్ వజ్రం లేని కిరీటంతోనే తన భర్త, కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని బ్రిటన్ రాణి కెమిల్లా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే బకింగ్హాం ప్యాలెస్ వర్గాలు అధికారికంగా వెల్లడిరచాయి.