మరో 40 విపక్ష పార్టీలు కూడా
బాంకాక్: మైన్మార్లోని సైనిక ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులను తొక్కేస్కోంది. తాజాగా ఆంగ్ సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీని రద్దు చేసింది. మరో 40 విపక్ష పార్టీలను కూడా రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఎన్నికలకు ముందు నిర్దేశిత గడువులోగా నమోదు చేసుకోనందుకు సూకీ పార్టీని రద్దు చేసినట్లు ప్రకటించింది. సూకీ పార్గీతో సహా మొత్తం 40 పార్టీలను రద్దు చేసినట్లు బుధవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్ఎల్డీ పార్టీ పార్లమెంటులో భారీ మెజారిటీ సాధించింది. 2015 నుంచి 2021 వరకు మైన్మార్ను పాలించింది. సైనిక తిరుగుబాటు క్రమంలో ఈ పార్టీ అధికారాన్ని పోగొట్టుకుంది. ఎన్నికలను బహిష్కరిస్తున్నామని, తమ పార్టీని నమోదు చేయమని ఎన్ఎల్డీ ఇంతకుముందే పేర్కొంది. కాగా ప్రస్తుతం ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కాలేదు. అవి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవు అని ఎన్ఎల్డీ పార్టీతో పాటు మిగతా విశ్లేషకులు అన్నారు. సైనిక పాలనలో స్వతంత్ర మీడియా గొంతు నొక్కేశారు. సూకీ పార్టీ నేతలను అనేకమంది కటకటాలపాలయ్యారు. 2020 నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఎన్ఎల్డీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. 2021 ఫిబ్రవరిలో సైన్యం తిరుగుబాటు చేసింది. పార్లమెంటు స్థానాలకు ఎన్నికైన శాసనసభ్యుల నుంచి వారి పదవులనే కాకుండా మొత్తంగా అధికారాన్నే లాగేసుకుంది. సూకీ ప్రభుత్వం, అధికార పక్షానికి చెందిన ముఖ్యనేతలను నిర్బంధించింది. సైనిక దుశ్చర్యను ప్రజలు తిప్పికొట్టారు. శాంతియుత ప్రదర్శనల ద్వారా నిరసన వ్యక్తంచేశారు. కానీ సైనిక ఆయుధశక్తి ఎదుట ప్రజలు బలహీన పడిపోయారు. ఈ పరిణామాల క్రమంలో సూకీ (77)కి 33 ఏళ్ల జైలుశిక్ష పడిరది. సైనిక పాలకులు అనేక కేసులలో ఆమెను ఇరికించారు. ఆమె మళ్లీ రాజకీయాల్లో రాకుండా కట్టడిచేసేందుకే అని సూకీ మద్దతుదారులు పేర్కొన్నారు. తాజా పరిణామంపై ఎన్ఎల్డీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు క్యావ్హ్వాటె స్పందించారు. సైన్యం నిర్ణయంపై పార్టీ ఉనికి ఆధారపడి ఉండదని, ప్రజలు మద్దతిచ్చినంత కాలం అది సజీవంగా ఉంటుందని చెప్పారు. ప్రజలు తమకు అప్పగించే బాధ్యతలను పార్టీ తప్పక నిర్వర్తిస్తుందని తెలిపారు. రెస్టు క్రమంలో సూకీ తన న్యాయవాదుల ద్వారా పంపిన సందేశం ఆధారంగానే ఆయన తాజా ప్రకటన చేశారు. ‘ప్రజల కోసం ఏర్పడిన పార్టీ ఎన్ఎల్డీ. ప్రజలు ఉన్నంత వరకు ఇది కూడా ఉంటుంది’ అని సూకీ సందేశమిచ్చారు.