బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు మరో షాక్ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. భారత మూలాలున్న రిషి సునక్తో పాటు పాక్ మూలాలున్న ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్.. తమ మంత్రిత్వశాఖలకు రాజీనామా చేశారు. రిషి.. ఆర్థిక మంత్రిగా, సాజిద్ ఆరోగ్య మంత్రిగా ఇప్పటివరకు పనిచేశారు. బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని ప్రభుత్వం సరైన రీతిలో పాలన సాగించడం లేదని రాజీనామా చేసిన మంత్రులిద్దరూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రిషి సునాక్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని వీడటం బాధగా ఉన్నప్పటికీ, తప్పడం లేదని అన్నారు. ప్రభుత్వం సమర్థవంతంగా, సరైన విధానంలో నడవాలని ప్రజలు కోరుకుంటారని, పోటీతత్వంతో ఇతర దేశాలతో పోటీ పడేలా ఉండాలని భావిస్తారని, కానీ అలా జరగడం లేదని చెప్పారు. ఇదే తన చివరి మంత్రి పదవి అని ఆయన అన్నారు. బోరిస్ సామర్థ్యంపై తనకు నమ్మకం పోయిందని జావెద్ చెప్పారు. ఆయన నాయకత్వంలో పరిస్థితులు మారవని అన్నారు.