ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ మరోసారి భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భారత్ మాదిరిగానే రష్యానుంచి ముడి చమురును తాము కూడా చౌకగా పొందాలని ఆశించి నప్పటికీ… తన ప్రభుత్వం కూలిపోవడంతో అలా చేయలేకపోయామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘భారత్ మాదిరిగానే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ చౌకగా కొనుగోలు చేయాలని మేము కోరుకున్నాం… కానీ, దురదృష్టవశాత్తూ అది జరగలేదు… మా ప్రభు త్వం అవిశ్వాసంలో కూలిపోయింది’ అని ఇమ్రాన్ తెలిపారు. గత ఏడాది ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పాక్ ప్రధాని పర్యటించారు. కానీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న పాక్కు ఉపశమనం కలిగించేలా ఏ ఒప్పందాన్ని రష్యాతో చేసుకోలేక పోయారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిగిన సమావేశాన్ని ఇమ్రాన్ ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పాశ్చాత్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, తన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడం, రష్యా చమురును కొనుగోలు చేయడంలో భారత్ సాధించిన విజయాలను ఖాన్ గుర్తించడం ఇదే మొదటిసారి కాదు. ‘ప్రపంచంలో నవాజ్కు తప్ప మరే ఇతర నాయకుడికి వేలకోట్ల ఆస్తులు లేవు… దేశం వెలుపల ప్రధాని లేదా నాయకుడికి వేల కోట్ల ఆస్తులు ఉన్న దేశం గురించి చెప్పండి… మన పొరుగు దేశంలో భారతదేశం వెలుపల ప్రధాని మోదీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి?’ గతేడాది సెప్టెంబరులో జరిగిన ఒక బహిరంగ సభలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఏడాది కూడా ఇమ్రాన్… భారత్ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. ‘ఓవైపు అమెరికాతో వ్యూహా త్మక భాగస్వామిగా ఉంటూనే మరోవైపు రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది…వారి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారత్ ఆ నిర్ణ యాలు తీసుకుంటోంది… కానీ మన విదేశీ విధానం మాత్రం ప్రజల ప్రయోజనాలకు చాలా దూరంగా ఉంది’ అంటూ సొంత దేశంపైనే విమర్శలు గుప్పించారు.