జెరూసలెం: జెరూసలేంలోని అల్అక్సా మసీదులో పలస్తీనియా ప్రజలపై ఇజ్రాయిల్ పోలీసుల దాడులు క్రమంలోనే లెబనాన్పై ఆ దేశం సైన్యం వైమానిక దాడులతో తెగబడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్
అక్సాలో రమదాస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చిన వారిపై రబ్బరు ` ఇనుప బుల్లెట్లు, గ్రెనేడ్లను ఇజ్రాయిల్ పోలీసులు ప్రయోగించారు. అనేక మందిని గాయపరిచారు. వందల సంఖ్యలో ప్రజలను నిర్బంధించారు. మరోవైపు గాజా స్ట్రిప్లో ఇజ్రాయిల్ సైనిక దాడులను స్థానిక మీడియా శుక్రవారం ధ్రువీకరించింది. దక్షిణ నగరమైన టైర్లోని శరణార్థి శిబిరం సమీపంలో పేలుళ్లు జరిగినట్లు పేర్కొంది. గురువారం అర్థరాత్రి పలస్తీనాలోని గాజాస్ట్రిప్పై ఇజ్రాయిల్ సైన్యం వైమానిక దాడులు జరిపింది. లెబనాన్ నుంచి హమాస్ తీవ్రవాదులు తమ దేశంపై రాకెట్లతో దాడి చేసినందునే ప్రతిఘటించినట్లు తాజా ప్రకటనలో ఇజ్రాయిల్ సమర్థించుకుంది.
44 రాకెట్లతో తమ దేశంపైకి దాడి జరిగిందని, 25 రాకెట్లను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని, మరో ఐదు తమ భూభాగంలో వచ్చి పడ్డాయని పేర్కొంది. హమాస్ చర్యకు ప్రతిస్పందనగా రెండు సొరంగాలు, రెండు ఆయుధ తయారీ స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. లెబనాన్ చర్యలను ఖండిస్తూ తగు పరిణామాలు తప్పబోవని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు హెచ్చరించిన కొన్ని గంటల్లోనే గాజా స్ట్రిప్పై వైమానిక దాడులు జరిగాయి.