గ్లాస్గో : ప్రపంచంలో చోటుచేసుకున్న వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించాలిన్న ఆవశ్యకతను స్వీడిష్ పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్ నొక్కి చెప్పారు. కాప్26 యువజన దినోత్సవం సందర్బంగా శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. గ్లాస్గోలో జరిగిన ఈ భారీ ప్రదర్శనకు గ్రెటా నాయకత్వం వహించారు.. ఈ ప్రదర్శనలో గ్రెటా మాట్లాడుతూ.. ‘వినండి, ప్రజల సూచనలు వినండి, వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినండి కేవలం వ్యాపారాల లాభాల కోసం ఈ చర్చలు వద్దు, భూ గహానికి ఏమి అవసరమో దానికి గాను తగిన చర్యలు చేపట్టండి’ అంటూ నినదించారు. ప్రపంచ నాయకుల పెద్ద పెద్ద వాగ్దానాలు మాకు వద్దుఅంటూ ఫిలిప్పైన్స్కు చెందిన వాతావరణ న్యాయకార్యకర్త జోసెల్ పేర్కొన్నారు. గ్లాస్గోలో జరుగుతున్న కాప్26 సందర్బంగా చర్చలు కొనసాగుతున్నందున రాజకీయ నాయకులు, వివిధ దేశాధినేతలు వాతావరణ మార్పులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ గ్లాస్గో పురవీధుల్లో భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో గ్రెటా, వెనెస్సా నకేట్, ఇతర యువ ప్రచారకులు, స్థానిక ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ వాతావరణ సమ్మెకు 25,000 మంది యువత హాజరయ్యారు. కాప్ 26సదస్సులో ప్రధానంగా యువత, విద్యపై దృష్టి సారించాయి. పర్యావరణ పరిరక్షణపై రెండువారాల కాప్ 26 సదస్సుపై గ్రెటా అసహనం వ్యక్తం చేశారు. దీనిని రెండు వారాల వ్యాపార లావాదేవీల వేదికగా పేర్కొన్నారు. అమెరికా, కెనడా సహా ఇరవై దేశాలు 2022 చివరి నాటకి విదేశీ శిలాజ ఇంధన నిధులను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. 40కిపైగా దేశాలు బొగ్గును దశలవారీగీ నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశాయి. ఈ దశాబ్దంలో మీథేన్ ఉద్గారాలను కనీసం 30శాతం తగ్గించాలని 100కంటే ఎక్కువ దేశాలు సంకల్పించాయి.