ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పేదరికం నిర్మూలన, పెట్టుబడుల పెంపుపై చర్చ
కృత్రిమ మేధతో ముప్పుపై పోప్ ఫ్రాన్సిస్ సందేశం
బారి (ఇటలీ): శరణార్థుల సమస్యకు పరిష్కారంపై గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) దృష్టి పెట్టింది. సమావేశాల రెండవ రోజు ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియాలో పరిస్థితులను సమీక్షించింది. పేదరికం, యుద్ధ పరిస్థితుల్లో దేశాల నుంచి జనం తరలిపోతుండటంపై చర్చించింది. మానవుల అక్రమ రవాణా, శరణ కోరేందుకు తమ ప్రాణాలనే పణంగా పెట్టేస్తుండటం, ఇటువంటి దేశాల్లో పెట్టుబడులు పెంచడం వంటి అంశాలను పరిశీలించింది. ఇటలీలోని పుగ్లియా ప్రాంతంలోగల విలాసవంతమైన రిసార్టులో జీ7 సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం రెండవ రోజు సమావేశాల్లో భాగంగా ఉక్రెయిన్కు ఆర్థిక మద్దతు, గాజా యుద్ధం, కృత్రిమ మేధ, వాతావరణ మార్పు, చైనా పారిశ్రామిక విధానం, ఆర్థిక భద్రత వంటి అంశాలు అజెండాలో ఉన్నాయి. అయితే వలసలపై సమావేశం ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది. యూరప్పై శరణార్థుల భారాన్ని తగ్గించేందుకు ఆఫ్రికా దేశాలకు మరింత నిధులు సమకూర్చడం, పెట్టుబడులు పెంచడంపై దృష్టి పెట్టాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నొక్కిచెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 22వేల మందికిపైగా ఇటలీలో శరణ కోరినట్లు యూఎన్హెచ్సీఆర్ గణాంకాలు చెబుతున్నాయి. 2023లో 1,57,000 మందికిపైగా రాగా మధ్యధరా సముద్రాన్ని దాటే క్రమంలో సుమారు రెండు వేల మంది చనిపోయారు లేదా ఆచూకి లేకుండా పోయారని డేటా చెబుతోంది. అమెరికా కూడా పెరుగుతున్న శరణార్థుల వల్ల ఇబ్బంది పడుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు జోబైడెన్ కొత్త విధానాలను ప్రతిపాదించారు కానీ అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందలేకపోయారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాతో పాటు భారత్, ఆఫ్రికా, ఆల్జీరియా, కెన్యా, టునీసియా దేశాధినేతలు జీ7 సమావేశాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేసేందుకు రష్యాకు వినియోగమయ్యేలా ఆయుధాలు, తయారీ సామగ్రిని ఆ దేశానికి సరఫరా చేయొద్దని చైనాకు జీ7 దేశాలు పిలుపునిచ్చాయి. ఇండో`పసిఫిక్, ఆర్థిక భద్రత అంశాలపైనా చర్చించాయి. కృత్రిమ మేధ ముప్పుపై కీలక ప్రసంగాన్ని పోప్ ఫ్రాన్సిస్ చేశారు. ఇలా ఓ పోప్ ఈ వార్షిక సదస్సులో ప్రసంగించడం ఇదే మొదటిసారి. మానవ విలువులు, కరుణ, నైతికత, క్షమాగుణం వంటివి లేకుండా ఉండే సాంకేతికతో మానవాళికి ముప్పు ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగం నైతికతతో కూడుకొని ఉంటుందని హామీనిస్తూ అంతర్జాతీయ ఒప్పందం జరగాలని వార్షిక శాంతి సందేశంలో భాగంగా పోప్ పిలుపునిచ్చారు.