కొలంబొ: ప్రజల ఆగ్రహానికిగురై విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స(73) తిరిగి స్వదేశానికి చేరుకున్నారని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. విమానాశ్రయంలో దిగిన రాజపక్సేకు వివిధ శాఖల మంత్రులు, రాజకీయ నేతలు పూలతో స్వాగతం పలికారు. బ్యాంకాక్ నుండి సింగపూర్ మీదుగా సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో దేశానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.దాదాపు 50రోజుల ప్రవాసం తర్వాత స్వదేశానికి రాజపక్స తిరిగివచ్చారు. వర్చువల్ ఖైదీగా థారు హోటల్లో ఉన్న రాజపక్స దేశంలోకి తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పించాల్సిందిగా వారసుడు, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ్సింఘేను అభ్యర్థించినట్లు సమాచారం. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాలైన ఆహారం, ఇంధనం ఖర్చులు పెరిగిపోయాయి. ఈ సంక్షోభానికి రాజపక్స సోదరులే కారణమంటూ ప్రజలు కొన్ని నెలల పాటు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజలు ఆగ్రహంతో అధ్యక్ష భవనాన్ని ముట్టడిరచడంతో మిలటరీ సాయంతో రాజపక్స దేశం నుండి పారిపోయారు. మొదట మాల్దీవుల్లో తలదాచుకున్న రాజపక్స అక్కడి నుండి సింగపూర్, తర్వాత థాయ్లాండ్కు చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వ 90రోజులు మాత్రమే అనుమతి ఇవ్వడంతో స్వదేశానికి రావాలని నిర్ణయించుకున్నారు.