అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో శ్వేత సౌధంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా జో బైడెన్, జిల్ బైడెన్ శ్వేత సౌధంలో దీపాలు వెలిగించారు. చరిత్రలోనే భారీస్థాయిలో నిర్వహించిన ఈ వేడుకల్లో బైడెన్ కార్యవర్గంలోని ఇండో-అమెరికన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాణసంచా పేలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా ఆతిథ్యమివ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. దీపావళి సందర్భంగా ఇప్పటి వరకు అధ్యక్ష భవనంలో జరిగిన అధికారిక వేడుకల్లో ఇవే అతిపెద్ద వేడుకలని తెలిపారు. అమెరికా సంస్కృతిలో దీపావళిని చేర్చినందుకు భారత సంతతికి, దేశంలో ఉన్న భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో పాటు భారత సంతతికి చెందిన అధికారులు, వ్యాపారస్తులు సుమారు 200 మంది తమ కుటుంబాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష భవనంలో ప్రతి అమెరికన్ తన సంప్రదాయాలను, తమకంటూ ప్రత్యేకమైన వేడుకలను నిర్వహించుకునే సత్సంప్రదాయాన్ని బైడెన్ దంపతులు నెలకొల్పారని కొనియాడారు. అంతకు ముందు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తన ఇంట్లో దీపావళి విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.