చైనా, కాంగో సంకల్పం
బీజింగ్: సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా ముందుకెళ్లాలని, తమ సంప్రదాయ మైత్రిని, సహకార బంధాన్ని మరింత బలపర్చుకోవాలని చైనా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (డీఆర్సీ) సంకల్పించాయి. ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మల్చుకోవడం ద్వారా రెండు దేశాలకు ప్రయోజనమని నిర్ణయించాయి. చైనా, డీఆర్సీ సంప్రదాయ మిత్రదేశాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. చైనా పర్యటనలో ఉన్న డీఆర్సీ అధ్యక్షుడు ఫెలిక్స్ ఆంటోని షిసెకిడి షిలోంబోతో బీజింగ్లో జిన్పింగ్ భేటీ అయ్యారు. అనేక అంశాలపై చర్చించిన దేశాధినేతలు ద్వైపాక్షిక సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించాలని నిర్ణయించారు. డీఆర్సీతో తమ అభివృద్ధి వ్యూహాలను పంచుకునేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు జిన్పింగ్ తెలిపారు. సహకారాన్ని, సంక్షేమాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు. డీఆర్సీ అధ్యక్షుడు మాట్లాడుతూ, ఆర్థిక, వాణిజ్య, మౌలికవసతులు, వైద్యసంరక్షణ తదితర రంగాల్లో చైనాతో కలిసి పనిచేస్తామని, సహకారాన్ని పెంచుకోవాలని కాంగో భావిస్తోందని అన్నారు. తమ దేశాల ప్రయోజనాల దృష్ట్యా సమగ్ర వ్యూహాత్మక సుస్థిర సహకారం అవశ్యమని చెప్పారు. చర్చల అనంతరం ఇద్దరు ద్వైపాక్షిక సహకార ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిజిటల్ ఎకానమీ, గ్రీన్ ఎకానమీ, పెట్టుబడులు తదితర రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతముందు గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్లో డీఆర్సీ అధ్యక్షుడికి జిన్పింగ్ ఘనంగా స్వాగతిమచ్చారు. అనంతరం విందుకు ఆతిథ్యమిచ్చారు.