వేతనాలు పెంచాలని డిమాండ్
వాషింగ్టన్ : వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 13వేలమంది కార్మికులు ఒకేసారి సమ్మెకు దిగారు. డెట్రాయిట్లోని మూడు వాహన తయారీ కంపెనీలకు చెందిన 13,000 మంది కార్మికులు శుక్రవారం సమ్మె ప్రారంభించారు. కార్మికుల డిమాండ్లపై సదరు సంస్థలతో యునైటెడ్ ఆటోవర్కర్స్ యూనియన్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. నాలుగేళ్ల ఒప్పందం గురువారంతో ముగియడంతో మూడు కంపెనీలకు చెందిన యూనియన్ సభ్యులు ఏకకాలంలో చర్చల నుంచి వాకౌట్ చేయడం అమెరికా 88 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటి సారి. మిస్సౌరిలోని వింట్జ్విల్లె నగరంలోని మోటర్స్ ప్లాంట్, మిచిగాన్ లోని ఫోర్డ్ ఫ్యాక్టరీ, ఒహియోలోని స్టెల్లాంటిస్ జీప్ ప్లాంట్ వద్ద కార్మికులు పికెటింగ్ ప్రారంభించారు. 60 యూనియన్ సమాఖ్య అయిన ఏఎఫ్ఎల్-సీఐఓ అధ్యక్షుడు లిజ్ మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఈ సమ్మెను పరిశీలిస్తున్నారు. నాలుగేళ్లలో 36 శాతం కన్నా వేతనాల పెంపుదల తక్కువగా ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవన వ్యయం భారీగా పెరిగిపోతున్నా… వాటికి అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని చెబుతున్నారు. 401కె తరహా పదవీవిరమణ పథకాలు, పదవీ విరమణ చేసినవారికి పెన్షన్ల పెంపుదలను డిమాండ్ చేస్తున్నారు.