టర్కీ, సిరియా భూకంపంపై డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: టర్కీ, సిరియా దేశాలను వరుస భూకంపాలు కుదిపివేశాయి. ఈ పరిణామాలతో దాదాపు 2.3 కోట్ల మందిపై ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంగళవారం తెలిపింది. సిరియా సుమారు 12ఏళ్ల సుదీర్ఘ`సంక్లిష్ట సంక్షోభం క్రమంలో అవసరాలూ అత్యధికంగా ఉంటే…. మానవతా నిధులు తగ్గుతున్నాయని పేర్కొంది. అనేక సంక్షోభాలకు మించిన సంక్షోభమిదని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ ఎమర్జెన్సీ అధికారి అడెల్హీడ్ మార్స్చాంగ్ అన్నారు. 1.4 మిలియన్ల మంది పిల్లలతో సహా 23 మిలియన్ల మందిపై ఈ సంక్షోభం ప్రభావం ఉంటుందని జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్ఓ బోర్డు సమావేశంలో ఆమె చెప్పారు. ఈ పరిస్థి తులను టర్కీ ఎదుర్కోగలదుగానీ సిరియా పరిస్థితి దయనీయంగా ఉన్నదన్నారు. మానవతా సంక్షోభం గుప్పిట్లో దీర్ఘకాలంలో ఉండ టం, యుద్ధం, కలరాతో పోరు క్రమంలో సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ దేశాన్ని తాజా భూకంపం మరింత సంక్షోభంలోకి నెట్టి వేసిందని ఆందోళన వ్యక్తంచేశారు. అత్యవసర సేవలను అంది స్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే ప్రకటించింది. అత్యవసరమైన వైద్య సామాగ్రిని బాధిత దేశాలకు సమకూర్చింది. ‘ఇది కాలానికి ఎదురీత’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రేయేసెస్ అన్నారు. ‘ప్రతి నిమిషం ఎంతో విలువైనది. గడిచే ప్రతి గంటతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీసేందుకు ఆశలు సన్నగిల్లుతాయి’ అని ఆయనన్నారు.