బీజింగ్ : భూగోళాన్ని రక్షించాలన్న బలమైన పిలుపుతో చైనా ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టింది. కాప్26 సమావేశంలో జిన్పింగ్ వాతావరణ మార్పుపై వర్చువల్గా మాట్లాడుతూ ఆందోళన కలిగించే సమస్యకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దేశాలు తమ కట్టుబాట్లను గౌరవించాలి, వాతావరణ చర్యలను అందించేందుకు జాతీయ పరిస్థితులకు అనుగుణంగా తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2030 లోపు చైనా కార్బన్ ఉద్గారాలను గరిష్ఠస్థాయికి తగ్గించుకోవాలని 2060లోపు కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని తమ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.. ఇంధనం, పరిశ్రమలు, నిర్మాణం, రవాణా, బొగ్గు, విద్యుత్, ఇనుము, ఉక్కు, సిమెంట్ వంటి కీలక రంగాల కోసం నిర్ధిష్ట అమలు ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. చైనా గత సంవత్సరం చివరి నాటికి 2005తో పోలిస్తే కార్బన్ ఉద్గారాల తీవ్రత 48 శాతం తగ్గించిందన్నారు. గత దశాబ్దంలో 120 మిలియన్ కిలోవాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దశలవారీగా నిలిపివేసింది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడేందుకు చైనా కీలకమైన సహకారం అందించిందని ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్కీ మూన్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉపగ్రహ సాంకేతికతతో వాతావరణ వ్యవస్థను పరిరక్షించడంలో ఆఫ్రికాకు మద్దతు ఇవ్వడం, ఆగ్నేయాసియాలో తక్కువ కార్బన్ పైలట్ జోన్ను నిర్మించడంలో చైనా స్పష్టమైన ఫలితాలను నమోదు చేసింది.