లిమా: పెరూ అధ్యక్షురాలు దీనా బలౌర్టె గద్దె దిగాలని ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలు, ప్రదర్శనలతో దేశం హోరెత్తుతోంది. అధ్యక్షురాలి రాజీనామాకు నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది ప్రాణాలను కోల్పోయారు. పెరూలో నిరసనలను ప్రజాస్వామ్యానికి ముప్పుగా దీనా అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించే హక్కు పెరూ ప్రజలకు లేదన్నారు. శాంతియుత నిరసనలకు పిలుపులపై స్పందిస్తూ తమది ప్రజాస్వామిక ప్రభుత్వమని, సంస్థాగతంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యానికి ముప్పును తలపెట్టనివ్వమని అన్నారు. నిరసనలు శాంతియుతంగా జరగాలని ఇతర హక్కులను హరించేందుకు ఆస్కారం లేకుండా ప్రదర్శనల వెంట ప్రాసిక్యూటర్ ఆఫీసు తరహా సంస్థల ప్రతినిధులు ఉంటారని చెప్పారు. అయితే 24వేల మంది పోలీసులను మోహరించగా అందులో 11 వేల మంది వరకు రాజధాని లిమాలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనా బలౌర్టె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలైనప్పటి నుంచి మానవహక్కులు ఉల్లంఘనలు విపరీతంగా జరిగినట్లు పెరూ ప్రజల్లో 81శాతం మంది చెప్పారు. నిరసనలపై ప్రభుత్వ వైఖరిని న్యూవో పెరూ పార్టీకి చెందిన వెరోనికా మెండోజా విమర్శించారు. బెదిరించాలని, హింసాత్మక ఘటనలను న్యూవో పెరూ పార్టీకి ముడిపెట్టాలని చూస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న వారు హింసను ప్రోత్సహిస్తున్నారని, ప్రజలపై కాల్పులు జరుపుతున్నారని, హత్యలకు సాయుధ దళాలే నేరుగా బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. తామెప్పుడు శాంతిని పెంపొందిస్తామని వెరోనికా చెప్పారు.