గ్వాటెమాల సిటీ: గ్వాటెమాలా అధ్యక్షుడి ఎన్నికల్లో అవినీతి వ్యతిరేకవాది, వామపక్ష నాయకుడు, ప్రోగ్రెసివ్ మూవ్మెంటో సెమిల్లా పార్టీ అభ్యర్థి బెర్నార్డో అరెవాలో ఘన విజయం సాధించారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం జరిగిన ఎన్నికలను ఆయన క్లీన్స్వీప్ చేశారు. 59.1శాతం ఓట్లతో గెలిచారు. ఆయనకు సమీప ప్రత్యర్థి శాండ్రా టోర్రెస్కు 36.1శాతం ఓట్లు వచ్చాయి. బెర్నార్డో అరెవాలో విజయం సాధించినట్లు సుప్రీం ఎలక్టోరల్ ట్రిబ్యునల్ ప్రకటించింది. ఎలక్టోరల్ ట్రిబ్యునల్ అధ్యక్షులు ఇర్మా పలెన్సియా స్పందిస్తూ ‘ఈరోజు ప్రజావాణి వినిపించింది’ అని అన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఎక్స్ మాధ్యమంగా ‘గ్వాటెమాలా వర్థిలాలి’ అని అరెవాలో నినాదమిచ్చారు. ‘ఇది ప్రజల విజయం. ఐక్యంగా అవినీతిని ఓడిద్దాం’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండ్రో గియామెట్టే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, జూన్లో జరిగిన తొలిదశ ఓటింగ్లో అరెవాలో (64) రెండో స్థానంలో నిలిచారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్షాల అభ్యర్థులపై అనర్హత వేటు క్రమంలో గౌటెమాలా ఎన్నికల సంఘంపై ప్రజలు గుర్రుగా ఉండటం, అర్హులైన ఓటర్లు 40శాతం మంది ఓటింగ్ను బహిష్కరించడం, 24శాతం మంది ఖాళీ బాలెట్లు /చెల్లని ఓట్లు వేయడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో 11.8శాతం ఓట్లు అరెవాలో సొంతం చేసుకోగా టోర్రెస్కు 16శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఓటింగ్లో టోర్రెస్పై అరెవాలో భారీ మెజారిటీతో గెలిచారు.