ఏథెన్స్: గ్రీస్ రాజధాని ఏథెన్స్లో నిర్వహించిన మూడురోజుల 49వ కేఎన్ఈఒడిగిటిస్ ఉత్సవం ముగిసింది. స్ఫూర్తినింపిన రాజకీయ కార్యక్రమంగా వేడుక సాగింది. కమ్యూనిస్ట్ యూత్ ఆఫ్ గ్రీస్ (కేఎన్ఈ) అధ్వర్యంలో ప్రపంచదేశాల కమ్యూనిస్టు యువజన సంఘాల సమక్షంలో యువజోత్సవాలు వైభవంగా జరిగాయి. వేలాది మంది కమ్యూనిస్టులు, వర్కర్లు, హాజరయ్యారు. చిన్న, పెద్ద తేడా లేకుండా పురుషులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. దీంతో ఉత్సవాల వేదికైన ట్రిట్సిస్ పార్కు కిక్కిరిసి పోయింది. ముగింపు వేడుకలో గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్ కౌట్సోంబస్ ప్రధాన వక్త కాగా కేఎన్ఈ కార్యదర్శి థోడోరిస్ కౌట్సాంటిస్, కేకేఈ పొలిటికల్ బ్యూరో సబ్యులు గియన్నిస్ ప్రోటౌలిస్ ప్రారంభోప న్యాసాలు చేశారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో యువజనోత్సవాలు అనేక కార్యక్రమాల సమాహా రంగా జరిగాయి. యువ కమ్యూనిస్టులను ఉత్తేజ పరుస్తూ, వారిలో స్ఫూర్తిని నింపడమే కాకుండా చైతన్యపరిచే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా కేఎన్ఈ
ఒడిగిటిస్ ఉత్సవం నిలిచింది. చీకటిని తొలగించే కిరణంగా సోషలిజం మార్గాన్ని అనుసరించేలా విప్లవకవి నజీమ్ హిక్మెట్ స్ఫూర్తితో యువజనోత్సవాలు జరిగాయి. సంగీత కచేరిలో ప్రముఖ కళకారులు మారియా ఫరాంటోరి, జార్జ్ దలారస్, వసిలిస్ పాల్గొన్నారు. స్టాండప్ కామెడీ, నాటకాలు, క్రీడా కార్యక్రమాలు, వివిధ ప్రదర్శనలు యువతను ఆకట్టుకున్నాయి. ప్రపంచ కమ్యూనిస్టు యువజన సంఘాలన్నీ ఉత్సవంలో పాలుపంచుకోగా క్యూబా, వెనిజులా తరపున కార్యక్రమాలను కేఎన్ఈ నిర్వహించింది. కేఎన్ఈ`ఒడిగిటిస్ ఉత్సవానికి 45ఏళ్ల చరిత్ర ఉంది. తొలి ఉత్సవం 1975 అక్టోబరులో జరిగింది.