కాబూల్: అఫ్గాన్ రాజధాని కాబూల్ మరోమారు పేలుళ్లతో దద్దరిల్లింది. శుక్రవారం జరిగిన దాడి నుంచి కోలుకోక ముందే శనివారం అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ స్ట్రీట్లో బాంబు పేలింది. తాజా ఘటనలో ఎనిమిది మంది మరణించారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని పశ్చిమ జిల్లాలో పేలుడు సంభవించినట్లు అధికారులు చెప్పారు. ఇక్కడ షియా వర్గీయులూ తరచూ భేటీ అవుతూ ఉంటారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్, సున్నీ ఉగ్రసంస్థ టెలిగ్రామ్ ద్వారా ప్రకటించింది. మృతుల సంఖ్య పెరగవచ్చు అని ప్రైవేటు ఆసుపత్రి సీనియర్ వైద్యాధికారి తెలిపారు. అంతర్గత శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ దర్యాప్తు బృందం ఘటన స్థలానికి వెళ్లి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తోందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఈ దాడికి సంబంధించి వీడియోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అంబులెన్సులు ఘటనాస్థలానికి చేరుకోవడం, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్మేసి ఉండటం కనిపిస్తోంది. శుక్రవారం దాడిలో ఎనిమిది మంది చనిపోగా 18 మంది గాయపడ్డారు. అఫ్గాన్లో ఐఎస్ నియంత్రణ లేనప్పటికీ స్లీపర్ సెల్స్ ఉన్నారు. వారి సాయంతో దాడులు చేస్తుంటుంది.