హనోయ్: వియత్నాం 78వ జాతీయ దినోత్సవం (సెప్టెంబరు 2) ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల శుక్ర,శనివారాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 1945, సెప్టెంబరు 2న వియత్నాంకు స్వాతంత్య్రం లభించింది. నాడు అధ్యక్షుడు హో చి మిన్ స్వాతంత్య్ర ప్రకటన చదివారు. దాంతో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం పురుడుపోసుకుంది. ఇప్పుడు అది సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంగా అవతరించింది. జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని లావో నగరంలోగల వియత్నాం దౌత్యకార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులు జేసంఫోనె ఫోంవిహానె, ఉప ప్రధాని, రక్షణ మంత్రి చాన్సామోనే ఛాన్యలత్, విదేశాంగ మంత్రి సల్యూంజే కమ్మాసిత్ పాల్గొన్నారు. లావోస్, పాక్సే నగరంలో వియత్నమీస్ కౌన్సుల్ జనరల్ న్యుయన్ వాన్ ట్రుంగ్కు స్నేతపతకాన్ని అందజేశారు. మైత్రి, సంఫీుభావం, సమగ్ర సహకారం కోసం అందించిన తోడ్పాటుకుగాను ఆయనను ఈ మెడల్లో ఘనంగా సత్కరించారు. అటు థాయిలాండ్లోని వియత్నాం దౌత్యకార్యాలయంలో వేడుక జరిగింది. థాయిలాండ్ ఓవర్సీస్ వియత్నామీస్ అసోసియేషన్ అధ్వర్యంలో మూంగ్ జిల్లా నూంగ్ ఆన్ గ్రామంలోని స్మారకం వద్ద హో చి మిన్ సంప్రదాయబద్ధంగా అగరువత్తులతో నివాళులర్పించారు. సింపూర్లోనూ ఏషియల్ సివిలైజేషన్స్ మూజియం వద్దనున్న హో చి మిన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అర్జెంటైనా, వియత్నాంలోనూ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రపంచ దేశాధినేతల శుభాకాంక్షలు: వియత్నాం 78వ జాతీయ దినాన్ని పురస్కరించుకొని లావోస్, చైనా, కంబోడియా, క్యూబా, రష్యా, ఉ.కొరియా, భారత్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్సీన్స్ తదితర దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాశారు. వియత్నాం విప్లవ చరిత్రను వారంతా శ్లాఘించారు.