మెక్సికోసిటీ : లోపెజ్ ఒబ్రడార్ ప్రభుత్వ విధానాలను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మెక్సికో (పీసీఎమ్) తీవ్రంగా ఖండిరచింది. ఒబ్రడార్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసంలేదని స్పష్టం చేసింది. దేశంలోని శ్రామిక వర్గ జీవన ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేసింది. కార్మికులు వారి ఆదాయాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ గంటలు పని చేయవలసి వస్తోంది. దేశంలోని ద్రవ్యోల్బణం 7.5 శాతంగా ఉంది, అయితే ఈ సంవత్సరం చివరి నాటికి 10 శాతానికి చేరుతుందని పీసీఎమ్ అంచనా వేసింది. ప్రాథమిక ఆహార ద్రవ్యోల్బణం దేశంలో 27శాతం పెరిగింది. ఇది కార్మిక కుటుంబాలపై పెను ప్రభావం చూపుతోంది. కోవిడ్ మహమ్మారి దేశంలో సంక్షోభాన్ని మరింతగా పెంచింది. ఉక్రెయిన్లో సామ్రాజ్యవాద యుద్ధ ఫలితంగా గోధుమల ధర రెట్టింపైంది. ఫలితంగా శ్రామికవర్గ కుటుంబాల నిత్యావసరాలపై బ్రెడ్, పాస్తా ధరలు రెట్టింపు అయ్యాయి. జీవన పరిస్థితుల్లో క్షీణత కారణంగా ప్రజలు ఒబ్రడార్ ప్రభుత్వంపై తీవ్ర అసహనంగా ఉన్నారని పీసీఎమ్ పేర్కొంది. ఒబ్రడార్ ఆధ్వర్యంలో గ్యాసోలిన్, ఆహార ధరల పెంపు రెండూ కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక చర్యలుగా గుత్తాధిపత్య అనుకూల చర్యలుగా పేర్కొంది. కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన జాతీయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందని పీసీఎమ్ పేర్కొంది.