పనామా : దక్షిణ అమెరికా దేశమైన పనామాలో పెట్రోల్ ధరలను తగ్గించారు. దేశంలో ఆహారం, ఔషధాలు, విద్యుత్, ఇంధన ధరల పెరుగుదల, అవినీతికి వ్యతిరేకంగా వేలాదిమంది ప్రజలు నిరసన చేపట్టారు. యూనియన్లు ఇచ్చిన పిలుపుమేరకు వేలాదిమంది ప్రదర్శనకారులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో పనామా సిటీలో పనామా విశ్వవిద్యాలయం పరిసరాల్లో విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 47శాతం పెరిగిన ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రెండవ వారం నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో పనామా అధ్యక్షుడు లారెంటినో కార్టిజో పెట్రోలు ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. పౌరులు కొనుగోలు శక్తిని పొందాలంటే సాధారణ జీతాల పెరుగుదలతో పాటు మందులు, ఆహారం, విద్యుత్, ఇంధనం ధరలను తగ్గించాలని నిరసనకారులు గళమెత్తారు. ఉక్రెయిన్లో సంఘర్షణల పరిణామాల కారణంగా ధరలు పెరిగాయని అధ్యక్షుడు టెలివిజన్లో పేర్కొన్నారు. ప్రైవేట్ వాహనాల పెట్రోల్ ధరలను తగ్గించడంతోపాటు, 10 ప్రాథమిక ఉత్పత్తుల ధరలను పరిమితం చేస్తామని తెలిపారు. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన అధ్యక్షుడు వారం రోజుల పాటు విధులకు గైర్హాజరు కావడంతో దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. జూలై ప్రారంభంలో ఉపాధ్యాయులు వీధుల్లోకి నిరసన చేపట్టారు. వీరితోపాటు భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు, యువత నిరసనలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కేవలం పెట్రోలు ధరలు తగ్గిస్తే సరిపోదని దేశంలో అన్ని రంగాల్లో విస్త్రతంగానియంత్రణ చర్యలు చేపట్టేవరకు తాము నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.