Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

మీతో బంధానికి తొలి ప్రాధాన్యతిస్తాం

రష్యా పర్యటనలో కిమ్‌ – పుతిన్‌తో భేటీ
వొటోచ్నీ స్పేస్‌ పోర్టు సందర్శన

వ్లాడివోస్టోక్‌: మాస్కోతో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి ప్యాంగ్యాంగ్‌ అధిక ప్రాధాన్యత ఇస్తుందని డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (డీపీఆర్‌కే) అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తెలిపారు. రష్యాలోని అముర్‌ జిల్లాలోగల వొటోఛ్నీ స్పేస్‌ పోర్టును సందర్శించారు. అక్కడే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కరచాలనం చేసి పలకరించుకున్నారు. అనంతరం కిమ్‌ మాట్లాడుతూ రష్యన్‌ ఫెడరేషన్‌తో సంబంధాలకు డీపీఆర్‌కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తమ బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ద్వైపాక్షిక చర్చలు దోహదమవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. రష్యాకు ఆహ్వానించినందుకు పుతిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కీలక సమయంలో ఈ భేటీ జరుగుతోందని అన్నారు. రష్యా గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి రష్యన్ల ఆత్మీయతను అనుభవం చేశామన్నారు. డీపీఆర్‌కే తరపున పుతిన్‌కు, రష్యాన్‌ ప్రజలకు అభినందనలు తెలిపారు. పుతిన్‌ మాట్లాడుతూ రాకెట్‌ టెక్నాలజీపై డీపీఆర్‌కే అధినేత అమితాసక్తిని కనబర్చారని అన్నారు. అంతరిక్ష రంగంలో తమదైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉన్నారన్నారు. స్పేస్‌ రాకెట్‌ సోయుజ్‌2 సంబంధిత ఇంజినీరింగ్‌ కాంప్లెక్స్‌, మొదటి అంతస్తులో అధినేతలు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు సహకారం, వాణిజ్యం, ఆర్థిక ` సాంస్కృతిక సంబంధాలు, ప్రాదేశిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ ఆంక్షలను అతిక్రమించేలా ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఉత్తర కొరియా నుంచి యాంటీ ట్యాంక్‌ మిసైళ్లు, తూటాలను రష్యా కోరుతుండగా అందుకు బదులుగా అత్యాధునిక క్షిపణి, అణు జలాంతర్గామి పరిజ్ఞానాన్ని ఆ దేశం ఇవ్వాలంటోందని నిపుణులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img