కర్రసాము అసోసియేషన్ నూతన కార్యవర్గం
విశాలాంధ్ర -రాజంపేట: సంప్రదాయ యుద్ధకళ అయిన కర్రసాము కు పూర్వ వైభవం తీసుకొస్తామని నూతనంగా ఎన్నికైన అన్నమయ్య జిల్లా కర్రసాము(సిలంబం)అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కర్రసాము నూతన కార్యవర్గాన్ని ఆదివారం శ్రీ కాళహస్తి లో ఎన్నుకోవడం జరిగినది. రాష్ట్ర అధ్యక్షులు పి.విజయ్ కుమార్, చైర్మన్ శ్రీనివాసులు, కార్యదర్శి చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి జనరల్ బాడీ సమావేశంలో అన్నమయ్య జిల్లా నూతన అసోసియేషన్ను ఎన్నుకొని ప్రకటించడం జరిగింది. అన్నమయ్య జిల్లా కర్ర సాము అసోసియేషన్ అధ్యక్షులుగా ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ బి.సునీల్, ఉపాధ్యక్షులుగా బచోటి భాస్కర్, ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహ, సంయుక్త కార్యదర్శులు కె.నాగరాజా, ఎ.ఉమా శంకర్, కోశాధికారి అయ్యపురాజు చంద్ర, గౌరవ సలహాదారులు టి.చంద్రశేఖర్ మరియు వి.నరసింహులు.. అలాగే, కార్యవర్గ సభ్యులుగా బి.సుధాకర్, కె.గంగారామ్ లను ఎన్నుకోవడం జరిగిందని కర్ర సాము అన్నమయ్య జిల్లా అధ్యక్షులు బి.సునీల్ తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ ప్రథమ కార్యవర్గ సమావేశాన్ని స్థానిక ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ భారతదేశ సంప్రదాయ కళ అయిన కర్రసాముకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. నాడు గ్రామాలలో వైభవోపేతంగా అలరారిన కర్రసాము నేడు అంతరించే దశకు చేరుకున్నదని., తిరిగి ఈ కళకు పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని వారు తెలియజేశారు.