పక్కా వ్యూహంతో పట్టుకున్న ఆగిరిపల్లి పోలీసులు
నిందితుడిపై నూజివీడు సబ్ డివిజన్లో 16 కేసులు
ఆగిరిపల్లి : అంతరాష్ట్ర గజదొంగను ఆగిరిపల్లి పోలీసులు పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. నిందితుడి నుంచి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు శుక్రవారం నూజివీడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడిరచారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం… జంగారెడ్డిగూడేనికి చెందిన అబ్బ దాసరి బాలు ప్రసాద్ అలియాస్ బాలు శ్రీను అలియాస్ సౌరి (25) పదేళ్ల నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 36పైగా కేసులు ఉన్నాయి. నూజివీడు సబ్ డివిజన్లో 16 కేసులు నమోదయ్యాయి. కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, మచిలీపట్నం సీసీఎస్ డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో హనుమాన్ జంక్షన్ సీఐ కె.సతీష్, నూజివీడు సీఐ వెంకటనారాయణ, సీసీఎస్ సీఐ బాలశౌరి, ఆగిరపల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబు, వీరవల్లీ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, సీసీఎస్ ఎస్ఐ అజయ్ కలిసి బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పక్కా వ్యూహంతో ఆగిరిపల్లి గ్రామంలోని మెట్ల కోనేరు వద్ద నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 16 కేసుల్లో 103 గ్రాముల బంగారు ఆభరణాలు, 570 గ్రాముల వెండి వస్తువులు, మోటారు సైకిళ్లు, కాపర్ వైర్, కేబుల్ వైర్, ఎనిమిది చీరలు రికవరీ చేశారు. వీటి విలువ రూ.9,08,500 ఉంటుంది. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ టాస్క్ నిర్వహించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ ప్రత్యేకంగా అభినందించారు. డీఎస్పీ బి.శ్రీనివాసులు చేతుల మీదగా రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో మచిలీపట్నం సీసీఎస్ డీఎస్పీ మురళీకృష్ణ, హనుమాన్ జంక్షన్ సీఐ కె.సతీష్, నూజివీడు సీఐ వెంకట నారాయణ, సీసీఎస్ సీిఐ బాలశౌరి, ఆగిరిపల్లి, వీరవల్లీ ఎస్ఐలు ఎన్.చంటిబాబు, సుబ్రమణ్యం, నూజివీడు సీసీఎస్ ఎస్ఐ సతీష్ బాబు పాల్గొన్నారు.