. గ్రూపు రాజకీయాలతో సామాన్య కార్యకర్తలు సతమతం
. ఒకరికి జై కొడితే ఇంకొకరికి కోపం
. పార్టీ గెలుపు కోసం కష్టపడడానికి మేము సిద్ధం
. మాతో కలిసి నడిచే నాయకుడు కరువు
. టీడీపీ సామాన్య కార్యకర్త ఆవేదన
విశాలాంధ్ర-(ఇబ్రహీంపట్న) మైలవరం:టీడీపీ నాయకుల ఆధిపత్య వర్గ పోరు చక్రంలో ఇరుక్కుని సామాన్య కార్యకర్తలు విలవిలలాడుతున్నారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఇప్పుడు వర్గ పోరుతో,అసమ్మతి రాజకీయాలతో క్లిష్టంగా మారింది. నాకు సీటు కావాలంటే నాకు సీటు కావాలంటూ నాయకులు కొట్టుకుంటుంటే ఎవరికి జై కొడితే ఎవరికి కోపం వస్తుందో, బ్యానర్ మీద ఎవరి ఫోటో వెయ్యాలో, వద్దో తెలియక సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు కార్యకర్తలు.
ఉదాహరణకు ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు వచ్చిన కార్యక్రమానికి చాలామంది కార్యకర్తలకు సమాచారం అందలేదనేది వాస్తవం. ఒకరు పిలుస్తారని మరొకరు, ఒకరి వర్గానికి ఇంకో వర్గం అంటూ అందరూ కలిసి కార్యకర్తలను తరలించడంలో విఫలమయ్యారు. దీంతో అధినాయకుడు వచ్చినా తనకు సమాచారం లేకపోవడం కార్యకర్తలకు తీవ్ర ఆవేదన కలిగించింది.
గొల్లపూడి కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం అన్నారు కానీ అందరికీ ఆహ్వానం అందలేదు. అసలు తాము ఏ వర్గమో చెప్పడానికి వీళ్ళు ఎవరు..? మేము పార్టీ వర్గం…..!! చంద్రబాబు వర్గం…!! అంటున్నారు కార్యకర్తలు.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం…!! వర్గ పోరులో అసమ్మతి సెగలో కాలయాపన చేస్తే ఇది పార్టీకి తీరని నష్టం.. కాబట్టి నాయకులు తమ స్వలాభాలు పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేసి సామాన్య కార్యకర్తకు బలం ఇవ్వాలని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయని అభిమానులు వాపోతున్నారు.