విశాలాంధ్ర`విజయవాడ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య 87వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ్శశివారెడ్డి, కోశాధికారి ఎం.సాయికుమార్ కోరారు. స్థానిక హనుమాన్పేటలోని దాసరి భవన్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను శివారెడ్డి, సాయికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని, ఎందరో విద్యార్థి నాయకులు తమ ప్రాణాలను వదిలారని గుర్తుచేశారు. జాతీయోద్యమ కాలం నుంచి నేటి వరకు విద్యారంగ సంస్థలపై పోరాడుతున్న ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని చెప్పారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో 1936 ఆగస్టు 12వ తేదీన ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్ అనేక మంది నాయకులను తయారు చేసి దేశానికి అందించిందని తెలిపారు. ఘన చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, తద్వారా విద్యార్థులను తమ సమస్యలపై పోరాటాలకు సమాయత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు చందు, సుధీర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.