విశాలాంధ్ర- పెద్దకడబూరు : జర్నలిస్టులపై దురుసుగా మాట్లాడిన వీరేష్ ను అరెస్టు చేయాలంటూ సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తాహశీల్దార్ కార్యాలయం ఎదుట పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షులు సోమన్న, సీనియర్ నాయకులు భీమన్న మాట్లాడుతూ ఆంధ్ర జ్యోతి పత్రికలో చెరువు చదునాయే అనే శీర్షికతో కథనం ప్రచురించడంతో ఆగ్రహించిన ఆలూరు పట్టణంలోని మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరుడు వైసీపీ మండల కన్వీనర్ వీరేష్ అధికార బలంతో ఆంధ్ర జ్యోతి ఎండి రాధాకృష్ణ, జిల్లా బ్యూరో కొండప్పను అసభ్య పదజాలంతో దూషించడం సరికాదన్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే బెదిరింపులకు పాల్పడడం ఎంత వరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. ఇటీవల కాలంలో పాత్రికేయులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్పందించి తక్షణమే మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరుడు వైసీపీ మండల కన్వీనర్ వీరేష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మల్లికార్జున, ఏలియస్ తదితరులు పాల్గొన్నారు.