ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి
విశాలాంధ్ర` ఆస్పరి : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ అర్హత ఎంపికలో వయోపరిమితితో పాటు పరీక్ష ఫీజు గడువు పెంచాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కారుమంచి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, ప్రధాన రహదారుల గుండా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల్లో వయోపరిమితి పెంచాలని బిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా కారుమంచి మాట్లాడుతూ ప్రతి ఏడాది 6700 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ మేరకు మూడు సంవత్సరాలకు 20 వేలకుపైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్యను 6,500 నుండి 21 వేలకు పెంచాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అభ్యర్థుల వయోపరిమితిని, ఉద్యోగాల సంఖ్యను, పరీక్ష సమయాన్ని కనీసం మూడు నెలలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులను సమీకరించి ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు ఉరుకుందప్ప, ఏఐవైఎఫ్ మండలం కార్యదర్శి రమేష్, ఏఐవైఎఫ్ మండల సహాయ కార్యదర్శులు దస్తగిరి, ఇస్మాయిల్, సురేష్, ఏఐవైఎఫ్ నాయకులు చంద్ర, రేవన్, వీరాంజనేయులు, చందు తదితరులు పాల్గొన్నారు.