వేదవతిని పూర్తి సామర్థ్యంతో నిర్మించాలి
ఆర్.సి.సి నాయకులు మసాలా ప్రకాష్
విశాలాంధ్ర`ఆస్పరి : కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల జీవనాడి అయినా వేదవతి ప్రాజెక్టు ను 8 టీఎంసీల సామర్థ్యం తో నిర్మించాలని కోరుతూ ఈనెల 13వ తేదీన జరుగుతున్న బైక్ యాత్రలో రైతుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ జిల్లా నాయకులు మసాలా ప్రకాష్, నియోజకవర్గ నాయకులు రాజ్ కుమార్ లు పిలుపు ఇచ్చారు. శుక్రవారం స్థానిక గాంధీ పార్కులో బైక్ యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం నిత్యం కరువు కాటకాలకు నిలియంగా మారిందని, ప్రతి ఏడాది కూడా ఈ ప్రాంతం నుండి వేల సంఖ్యలో ప్రజలు, రైతులు, యువకులు వలసలకు వెళుతుండటంతో ఈ ప్రాంతం వలసలకు నిలియంగా మారిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ నివేదికల ప్రకారం వేదవతి ప్రాజెక్టును 8 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిర్మించాలన్నారు. కానీ ప్రభుత్వాలు నిస్సిగ్గుగా కేవలం 3 టీఎంసీలతో నిర్మించాలని చెప్పి, నిధులు లేవనే సాకుతో ఆపివేయ్యడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో అన్ని గ్రామాలకు సాగు, తాగునీరు అందించాలని, అలాగే ఆయకట్టు గ్రామాలుగా గుర్తించాలని, హంద్రీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాగలు, వంకలు పైన చెక్కు డ్యామ్ లు నిర్మించాలని, ఇక్కడి పంటలకు ప్రభుత్వమే మార్కెట్ సదుపాయం కల్పించాలి డిమాండ్ చేశారు. ఈనెల 13వ తేదీన జరగబోయే బైక్ యాత్రను రైతులు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వీరేష్, సందీప్, అక్బర్, రామకృష్ణ, మహేంద్ర, రాజు, మధు, శీను, తదితరులు పాల్గొన్నారు.