ఆర్.సి.సి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
విశాలాంధ్ర ` ఆలూరు : కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల జీవనాడి అయినా వేదవతి ప్రాజెక్టు ను 8 టీఎంసీల సామర్థ్యం తో నిర్మించాలని రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంతరెడ్డి, జిల్లా నాయకులు మసాల ప్రకాష్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ఆర్.సి.సి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంతరెడ్డి బైక్ యాత్రను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం నిత్యం కరువు కాటకాలకు నిలియంగా మారిందని, ప్రతి ఏడాది కూడా ఈ ప్రాంతం నుండి వేల సంఖ్యలో ప్రజలు, రైతులు, యువకులు వలసలకు వెళుతుండటంతో ఈ ప్రాంతం వలసలకు నిలియంగా మారిందన్నారు. రాయల సీమలో సాగు, త్రాగునీరు పారే నదులు ఉన్న ఇక్కడ కరువు, వలసలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. రాయలసీమ వెనుకబాటుతనం ఎన్నికల అంశంగా మారిపోయిందని, ఎన్నికలలో గెలవడానికి మాత్రమే వేదవతి ప్రాజెక్టు నిర్మాణ అంశం ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే ఈ ప్రాంతపు యువకులు సాగు, త్రాగు నీటి వాటా కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు. రైతులు ప్రజలందరూ దీనిని స్వాగతించాలని కోరారు. కరువు, వలస పోవాలంటే ప్రాజెక్టులు నిర్మించడమే ఏకైక మార్గం అన్నారు. ఆస్పరి మండలాన్ని ఆయకట్టు మండలంగా గుర్తించాలన్నారు. మండలంలో అన్ని గ్రామాలకు సాగు, తాగునీరు అందించాలని, హంద్రీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాగలు, వంకలు పైన చెక్కు డ్యామ్ లు నిర్మించాలని, ఇక్కడి పంటలకు ప్రభుత్వమే మార్కెట్ సదుపాయం కల్పించాలి డిమాండ్ చేశారు. ఆలూరు అంబెడ్కర్ సర్కిల్ నుండి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ యాత్రను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు మారిన, ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన కరువు, వలసలు మారలేదని అందుకే పార్టీల కు అతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర కార్యక్రమంలో ఆర్.సి.సి నియోజకవర్గ నాయకులు రాజ్ కుమార్, అర్జున్, రామకృష్ణ, వీరేశ్, సందీప్, మహానంది, అక్బర్, మధు, మహేంద్ర ,తదితరులు పాల్గొన్నారు.