కార్యాలయానికి వేచి ఉన్న తాళం
11 దాటిన అధికారుల జాడే లేదు..
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
విశాలాంధ్ర`ఆస్పరి : మాదే ఆఫీసు మా ఇష్టం వచ్చిన సమయానికి మేము వెళ్తాం మమ్మల్ని ఎవరేం చేయలేరు అని ఉదయం 11 : 30 గంటలు అవుతున్న ప్రభుత్వ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఉద్యోగులు రాని సంఘటన బుధవారం ఆస్పరి లో చోటుచేసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉదయం 11 దాటినా కార్యాలయం తలుపులు తీయలేదు. తాళం వేసి ఉండటంతో రైతులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పనితీరు ఇలా ఉందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఉదయం గం 9.30 ల నుండి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు విధులు నిర్వహించాలి. మద్యాహ్నం గం 11.30 వరకు కూడా తలుపు తీయకపోవడం విడ్డూరంగా ఉందని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సమయపాలన తో పాటు తమ విధులను సక్రమంగా నెరవేరుస్తారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సమయపాలన పాటించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. ప్రభుత్వ కార్యాలయమే కదా తమ ఇష్టం వచ్చిన సమయానికి రావచ్చన్న ధీమాతో ఉద్యోగులు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సమస్యలను పరిష్కరించే అధికారులే సమయపాలన పాటించకపోతే ఎలా..? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమయపాలన పాటించని ఉద్యోగులను గుర్తించి సస్పెండ్ చేయాలని వివిధ పనులు నిమిత్తం వచ్చిన ప్రజలు కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.