విశాలాంధ్ర పెద్దకడబూరు : గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, ఈఓఆర్డి వెంకట రమణప్ప, ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివ లింగమ్మ సూచించారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో ప్రభాకర్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో అభం శుభం తెలియని అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి పంపుతున్నారని, దీంతో అమ్మాయి అనేక అనర్థాలకు గురవుతుందని, చివరికి బాలింత వంటి రోగాల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.