Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మతోన్మాద బిజెపీని సాగనంపుదాం

విశాలాంధ్ర, పెద్దకడబూరు : ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపీని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం నాయకులు పరమేష్, అంజినయ్య పిలుపునిచ్చారు. శనివారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ, అమిత్ షా నాయకత్వంలోని బిజెపి – ఆర్ ఎస్ ఎస్ కూటమి అన్నదమ్ముల్లా ఉండాల్సిన ప్రజల మధ్య మత విద్వేషాలను రాజేస్తుందని విమర్శించారు. మరో వైపు ఆదానీ, అంబానీ లాంటి అతి సంపన్నులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరనీ నిరంకుశంగా అణచివేస్తుందన్నారు. ఉమ్మడి సంపదగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను, అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు ధారాదత్తం చేస్తుందని అన్నారు. అలాగే రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకెజ్ వంటి హామీలను నెరవేర్చడంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కావున ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కలిసి ఇంటికి సాగనంపుదామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు జాఫర్ పటేల్, నాయకులు తిక్కన్న, డోలు హనుమంతు, రెక్కల గిడ్డయ్య, వీరాంజనేయులు, హయత్ పటేల్, సిపిఎం నాయకులు ఉప్పర ఈరన్న, డివైఎఫ్ఐ దేవదాస్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img