తహశీల్దారు బి సుదర్శన రావు
విశాలాంధ్ర – నెలిమర్ల : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దారు బి సుదర్శన రావు తెలిపారు. మండలపరిధిలోని సారిపల్లి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ గ్రామాలలో దీర్ఘకాలంగా అపరిష్కతంగా ఉన్న భూ సమస్యలు, వివాదాలు పరిష్కరించటమే రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సులలో కేవలం భూమికి సంబంధించిన సమస్యలే కాకుండా ప్రజలు ఏ సమస్యలు ఉన్న అర్జీలు అందజేసి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వేణుగోపాల్, ఎం ఎస్ దివ్య మానస, వి ఆర్ ఓ లు ఎం లక్ష్మి, కె వెంకటరమణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.