దిల్లీ : గత ఎనిమిది నెలలుగా రూ.లక్ష కోట్లకు పైగా ఉన్న జీఎస్టీ వసూళ్లు.. జూన్ నెలలో మాత్రం కొంతమేర తగ్గి రూ.92 వేలకోట్లుగా నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం లాక్డౌన్లు, ఆంక్షలు విధించిన కారణంగా జూన్లో కేంద్రానికి జీఎస్టీ రూపంలో ఆర్జన తగ్గింది. అయితే మునుపటి సంవత్సరం జూన్ నెల వసూళ్లతో పోలిస్తే ఇది 2శాతం ఎక్కువ అని కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్లో మొత్తంగా రూ. 92,849కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. ఇందులో కేంద్రం వాటా(సీజీఎస్టీ) రూ.16,424కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ(ఎస్జీఎస్టీ) రూ. 20,397కోట్లుగా ఉంది. సమ్మిళిత జీఎస్టీ కింద రూ.49,079కోట్లు, సెస్ రూపంలో రూ. 6,949కోట్లు వసూలైనట్లు ఆర్థికశాఖ వివరించింది. కరోనాతో లాక్డౌన్లు, ఆంక్షల అమలుతో జూన్లో వ్యాపార కార్యకలాపాలు తగ్గాయి. ఏప్రిల్లో 5.88కోట్ల ఇ-వే బిల్లులు రాగా.. మే నెలలో వాటి సంఖ్య 3.99కోట్లు మాత్రమే. దీంతో జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు తగ్గినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో గత నెలలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చాయి. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడంతో జూన్లో 5.5కోట్ల ఇ-వే బిల్లులు నమోదయ్యాయి. దీంతో జులై నుంచి మళ్లీ వసూళ్లు పెరుగుతాయని కేంద్రం విశ్వాసంతో ఉంది.