‘‘ఈ భూమికి పచ్చపచ్చని రంగులద్దే కృషీవలుని మించిన కళా కారుడెవరు? మనిషి సజీవతకు సారాన్ని అందిస్తూ చెమట చిత్తడికి చైతన్య రూపమైన సైనికుని మించిన సేవాతత్పరుడెవరు? మట్టిలాలనలో రక్తాన్ని స్వేదంగా మార్చి
మొలకెత్తే విత్తుకు సేవలందించే
సేద్యగాణ్ణి మించిన శ్రమజీవి ఎవరు?
ధ్వంసమౌతున్న హరిత స్వప్నాన్ని
ఓర్పుతో నేర్పుతో రక్షించుకుంటూ
ఛిద్రమవుతున్న చిరునవ్వులను
ఆనందాన్వేతీనిస్తూ ధర్మనిష్ఠతో బతికే
ధరణీ నేస్తం రైతుగాక మరెవరు?’’
నేలతల్లి ముద్దు బిడ్డయిన రైతు సజీవ రూపాన్ని సజీవ భాషలో వర్ణించిన పై పాదాలు చదువుతుంటే నిత్యం భూమిపూజ చేసే కోట్ల మంది రైతులు నా కళ్ళ ముందు కదిలాడారు. నేలను దున్ని అన్నాన్ని మొలకెత్తించే అన్నదాతల నాగళ్ళు, చాళ్ళను సింగారిస్తూ కన్పించాయి. మనుషుల చిరునవ్వుల్ని పంటచేలో చూచుకుని పరవశించే సేద్యగాళ్ళ ఆశలు, ఆకాంక్షలు మన గుండెల్ని తట్టిలేపి, ఒక్కసారి పొలంగట్ల మీద నడవ మంటాయి పై పాదాలు. సృష్ట్యాది నుండి మనిషి మనుగడకు మూలస్తంభంగా నిలిచిన వాడు రైతు. నేలను దున్ని మట్టి నుండి అన్నాన్ని బయటకు తీసిన తొలి శాస్త్రవేత్త రైతు. నాగేటి చాళ్ళలో దేశ భవిష్యత్తును చూయించిన తొలి దార్శనికుడు రైతు. తాను తింటూ పది మందికి పెడుతూ అందరూ సుఖంగా బతకాలని కోరుకునే తొలి సమ సమాజ సిద్ధాంతకర్త కర్షకుడు.
ఒకప్పుడు రైతేరాజు. రాజుల కాలంలోనూ రైతు పూజలందుకున్నాడు. అన్నం తినే ప్రతివాడూ రైతును గౌరవంగా చూసేవాడు. కాలం మారింది. జీవితపు విలువలూ మారాయి. గ్రామీణ వృత్తులు తారుమారయ్యాయి. అందర్నీ కాపాడే కాపుగా, దేశాభ్యుదయానికి కాపుగా నిలిచిన రైతు మారిన పరిస్థితుల్లో నిలువ నీడలేని వాడయ్యాడు. అందరి గోడునూ ఆలకించిన అన్నదాతే తన గోడును వినమంటూ రోడ్డెక్కాడు. కాడి, మేడి మూలన పడ్డాయి. ప్రభుత్వాల కనికరం కరువైంది. కర్ణుడి చావుకు వంద కారణాల న్నట్లుగానే శతానేక సమస్యలు రైతును చుట్టుముట్టి సేద్యానికి పొగపెట్టాయి. తన బిడ్డకు దాపురించిన కష్టాన్ని చూచి నేలతల్లి కన్నీళ్ళు కారుస్తుంది. నేలతల్లి కన్నీటి గోడును ‘‘నాగేటిగోడు’’ గా మనకు విన్పిస్తున్న కవి కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. కనిగిరి సీమ కన్నీటి గోడు తెలిసిన కొండ్రెడ్డి కలం తనదైన ‘‘దుక్కిచూపు’’తో తలగుడ్డల దుఃఖాశ్రువుల్ని సరికొత్త కథాకావ్యంగా ఆవిష్కరించింది.
కొండ్రెడ్డి వారు మా ప్రకాశం జిల్లా వర్తమాన కవుల్లో అగ్రగామి. టీచర్గా, హెడ్మాష్టర్గా, విద్యాధికారిగా విద్యారంగ వికాసానికి విలువైన సేవలం దించారు. ఉద్యోగంలో వుంటూనే కవితా వ్యవసాయం ప్రారంభించిన కొండ్రెడ్డి కరువు సీమ కనిగిరిలో మంచి కవిత్వాన్ని పండిరచారు. నదీ ప్రవాహంలా సాగిన వారి సాహిత్య ప్రస్థానంలో మలుపులున్నాయి. గెలుపు లున్నాయి. అందుకున్న అవార్డులు, పొందిన పురస్కారాలున్నాయి. కొండ్రెడ్డి నిబద్ధతతో కవిత్వం రాసిన అనిబద్ధ కవి. సమకాలీన సామాజిక, సాహిత్య ఉద్యమా లన్నింటికీ సానుకూలంగా స్పందించిన వారి లేఖిని వస్తువైవిధ్యానికి చిరునామాగా నిలిచింది. నిష్పాక్షికమైన వారి వైమర్శిక దృష్టి ఉత్తమ సాహిత్య విమర్శకు అటపట్టయింది. కుందుర్తి వచన కవితా మార్గాన్ని మరింత విస్తరించి, కవిత్వాన్ని గ్రామీణులకు చేరువ చేసిన వారిలో కొండ్రెడ్డి ఒకరు. మా గురుదేవులు నాగ భైరవ కోటేశ్వరరావు ఆశీస్సులతో అక్షరాలకు సరికొత్త కాంతినిచ్చి తమ కలం పదునును నిరూపించుకున్నారు. అతి కొద్ది కాలంలోనే సాహితీ లోకంలో అజేయుడిగా అందరి దృష్టి నాకర్షించారు. నిత్యం పత్రికల్లోని సాహిత్యం పేజీల్లో పతాక శీర్షికగా కనిపించే కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి పరిచయమైన తొలినాళ్ళలో మిత్రునిగా, అనంతరం ఆత్మీయ సోదరునిగా, ప్రస్తుతం గురువర్యులుగా నాకు అభిమాన పాత్రులయ్యారు.
‘‘రైతంటే అదును, పదునెరిగి
కురిసే శ్రామిక మేఘం’’ – అన్నారు. ఈ పాదాలు రైతు గుండె చప్పుడు తెలిసిన కొండ్రెడ్డి వారి కలానికి వర్తిస్తాయి. అదును, పదును తెలిసి కవిత్వమే పనిగా పాఠకుల గుండెలపై కురుస్తున్న కర్షక కవి కొండ్రెడ్డి. ‘‘పైరుకు పంట కిరీటాన్ని పెట్టి. బువ్వ విత్తుల్ని చల్లి మన ఆకలి తీరుస్తున్న అక్షరాన్నదాత కొండ్రెడ్డి.‘‘మట్టి భాష తెలిసిన రైతన్న బతుకు చెమ్మను ఆర్చుతూ, చెమట చెట్టుకు దోపిడీ చీడను పట్టిస్తున్న ప్రభుత్వ పెద్దల్ని నిలదీశారు ఈ కావ్యంలో. అన్నదాత బతుకు కునారిల్లి పోవడానికి కారకులైన అన్ని శక్తుల్ని ప్రశ్నలతో నిలదీశారు. నేలను నమ్ముకున్న రైతుకు నమ్మకద్రోహం అంటే తెలిసేలా చేస్తున్న కుట్రలన్నింటినీ బహిర్గతం చేశారు.
‘‘దైవభక్తి ముసుగులో/ దేశభక్తిని విస్మరిస్తూ దోపిడీ శక్తిని సంస్మరిస్తున్న’’ నయవంచకులైన నాయకులకు కళ్ళు తెరిపించే నిజాలు చెప్పారు. రైతుల్ని విస్మరిస్తే అధికార పీఠాలు కదలక తప్పదని హెచ్చరించారు.
‘‘మనిషి ఆర్థిక స్వార్థం వీడినపుడే
మట్టి అమ్మతనం అర్థమవుతుందన్నారు.’’
‘‘అనుభవంలో
దుఃఖాన్ని చవిచూడని బతుకుండదం’’టారు.
‘‘గాయాన్ని ముద్దాడని ప్రేముండదం’’టారు
స్వాతంత్య్రం సిద్దించి, అమృతోత్సవాలు జరుపుకుంటున్నా-
‘‘బడుగు బలహీన వర్గాల జీవితాలు
కంప మీద ఆరేసిన వస్త్రంలా
లాక్కోలేక, పీక్కోలేక
చివరకు చిరిగిపోతూనేవున్నాయ’’న్న
కఠోర వాస్తవాన్ని మన ముందుంచారు.
‘‘కష్టజీవికి ఇరువైపులా వుండేవాడే కవి’’ – అని మహాకవి శ్రీశ్రీ వర్ణిస్తే- నేటి కవులంతా ‘‘కష్ట జీవుల్ని పట్టించుకోకుండా ‘‘పోస్ట్ మోడర్నిజం’’ ఊహల్లో ఉయ్యాలలూగుతున్న కవులు అవార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారని నిర్భీతితో గళమెత్తారు.
ఇప్పటికైనా కవులంతా
‘‘అన్నదాతను భవిష్యత్తుల్లోకి నడిపించే
బలోపేతమైన భావజాలంతో
పద్యాన్ని ఓదాన్ని అందుకుని
అంతరాత్మ దాహం తీర్చుకోవాలంటారు.
అవును. కవులు అంతరాత్మల్ని వెలిగించుకుని, అన్నదాతల ఆత్మక్షోభకు అంతిమ పరిష్కారం చూపాలి. సమాజానికి, జీవితానికి దూరంగా జరిగే సాహిత్యానికి ఎప్పుడో కాలం చెల్లింది.
‘‘బతుకును బతికించుకోవడమే/బతుక్కి మనమిచ్చే బహుమానం’’ అంటున్న కొండ్రెడ్డి అద్భుతమైన అభివ్యక్తుల తార, పద చిత్రాలతో, గ్రామీణ పలుకుబడులతో రైతు జీవితాన్ని కథా కావ్యంగా మలిచారు. రైతు బతికితేనే సమాజం బతికి బట్టకడుతుందన్న పెద్దల మాటకు చద్దిమూట లాంటి చక్కని, చల్లని వ్యాఖ్యను పై పాఠాల్లో మనకు రుచిచూపారు.
‘‘నాగేటిగోడు’’ కావ్యాన్ని ప్రారంభం నుండి చివరి వరకు ఏక బిగిన చదివి, ముగ్ధుడయ్యాను. చాలు తప్పని కోండ్రలా, జలపాతంలా సాగిన కొండ్రెడ్డి కవన ధారకు మురిసిపోయాను. కొన్నిచోట్ల కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఇంకొన్ని చోట్ల కవితో పాటు నేనూ కన్నెర్ర చేశాను. మరికొన్ని చోట్ల పిడికిలి బిగించాను. సాటికవిగా రైతు బిడ్డగా ఇంత మంచి కథాకావ్యం రాయలేక పోయినందుకు సిగ్గుపడ్డాను. ఆనాటి కర్షక కవులు దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి, ఏటుకూరి వెంకట నరసయ్యల సరసన చేరటం చోటు సంపాదించిన మన కనిగిరి సీమ కర్షక కవి కొండ్రెడ్డిని చూసి గర్వపడ్డాను.
‘నాగేటిగోడు’ కావ్యంలో కొండ్రెడ్డి వారు రైతును ధీరోదాత్తునిగా, త్యాగమూర్తిగా పోరాట యోధునిగా నిలిపారు. రైతులతో గొంతుక కలిపారు. పంజాబ్, హర్యానా రైతుల అజరామర పోరాటాన్ని అక్షరీకరించారు. కష్టాలు, కన్నీళ్ళకు తలవంచని రైతు జీవితం వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అక్షర యోధులైన కవులు కాలక్షేప కవిత్వానికి స్వస్తి చెప్పి, కర్షక కవిత్వానికి శ్రీకారం చుట్టాలనే గుండె నాదాన్ని వేదంగా, సామాజిక నినాదంగా విన్పిస్తుంది ‘‘నాగేటి గోడు’’ కావ్యం.
‘‘భూమ్మీద సేద్యగాడు అంతరిస్తే
సూర్యుడు అస్తమించినట్లే – నన్న మహత్తర సందేశం ఈ కావ్యానికి మకుటంగా నిలుస్తుంది. ఈ కావ్యం చదివాక అన్నం ముద్దతో పాటు, బతుకును ముద్దాడటమూ తెలిసింది. ఎడారై పోతున్న మనస్సును, వెంటాడుతున్న తమస్సును, దృశ్యం అదృశ్యమై పోతుంటే స్వేచ్ఛా రహిత మనుగడ చెల్లని నాణెంలా గిరాటు వేయబడటాన్ని గుర్తించాను. ఈ కావ్యం చదివాకనే మట్టికున్న అమ్మతనం తెలిసింది. అన్నదాత అమరత్వం అవగతమైంది. మట్టిని గుప్పిట్లోకి తీసుకోగానే తాత, తండ్రుల శ్వాసలు విన్పించాయి. అమ్మ, నాన్నల ఆకారాలు కన్పించాయి. తరతరాలుగా తడి ఆరని నేలకన్నీటి తడి గుండెను ఆర్ధ్రం చేసింది. మట్టి మౌన భాష నాకు సరికొత్త భూమి భాషను నేర్పింది. విశ్వమానవ జీవన కళా పారంగతులైన రైతుల రైతరికానికి వ్యాఖ్యానమే ‘‘నాగేటిగోడు’’. జనన ప్రయోజకత్వాన్ని ఆచరణలో నిరూపించుకునే అన్నదాత అంతరంగానికి అక్షర రూపం ‘నాగేటిగోడు’. కొండ్రెడ్డి వారి మాటల్లోనే చెప్పాలంటే- ‘‘జీవితాన్ని / ఎన్నిసార్లు వ్యాఖ్యానించినా ఏదో మిగిలిపోతూనే వుంటుంది.’’ ‘నాగేటిగోడు’ కావ్యం గురించి ఎంతరాసిన రాయవలసినదెంతో వుంటుంది. ఉత్తమ కావ్య లక్షణం కూడా అదే. అలాంటి ఉత్తమ కథా కావ్యాన్ని 75 ఏళ్ళ వయసులో మన కందించిన కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి బంగారు కలానికి పాఠకలోకం తరపున సదా వందన మందారాలు.
డా. బీరం సుందరరావు, 6303443302.