చింతపట్ల సుదర్శన్
స్వాతంత్య్రం సాధించిన భారత్కు 75 ఏళ్ల వయస్సు రావడాన్ని ఎంతో ఘనంగా జరుపుతామన్న సర్కారువారి పాట మొదట్లో కొంచెం ఘనంగానే వినిపించినప్పటికీ ఆ తర్వాత అంత ఘనంగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు దేశమంతటా జరిగినట్టు లేదు. మన వాళ్లు ప్రదర్శించే జూంవబసశీ వఎశ్ీఱశీఅం లో దేశభక్తి ఒకటి కదా.అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడక్కడ కొన్ని సంస్థల వారు సర్కారు వారి ప్రమేయం లేకుండా సాయం అందకుండానే కార్యక్రమాలు నిర్వహించాయి. వీటిల్లో పుస్తక ప్రచురణ ఒకటి. విశేషంగా చెప్పుకోదగ్గవి ఎక్కువగా లేకపోయినా ‘‘వెలుగు సాహితీ సంస్థ’’ విజయనగరం తరఫున వెలుగు రామినాయుడు ఆధ్వర్యంలో ప్రచురించిన ‘స్వరాజ్య స్ఫూర్తి ఏ 75’ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. స్వతంత్ర పోరాటంలో సర్వస్వం త్యాగం చేసిన ప్రజా వాగ్గేయకారుడు గరిమెళ్ల సత్య నారాయణకి అంకితం యిచ్చిన ఈ సంపుటి దేశ స్వాతంత్య్ర అమృతోత్సవ స్ఫూర్తికి అక్షర రూపం కల్పించిన వ్యాస సంకలనం.
మాతృదేశ బానిస సంకెళ్లను ఛేదించడానికి ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేశారు. ప్రతి యేటా స్వతంత్ర దినోత్సవం జరుపుకునేటప్పుడు మన నాయకులు తమ మూస ఉపన్యాసాల్లో వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన వారి వల్ల మాత్రమే స్వరాజ్యం సిద్ధించిందని చెప్పడం అలవర్చుకున్నారు. స్వతంత్రం కేవలం ఒక పార్టీ కారణం గానో, కొందరు వ్యక్తుల కృషి వల్లో వచ్చింది కాదని, అందుకు సంబంధించిన చారిత్రక సత్యాలను, వివిధ అంశాలను, నిస్వార్థంగా కృషి చేసిన అనేకులను గురించిన అవగాహనను ఈ తరానికి అందజేయవలసిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని ఈ ‘స్వరాజ్య స్ఫూర్తి ఏ 75’ లోని వ్యాసకర్తలు ఒక బాధ్యతగా నిర్వర్తించారు. వ్యాసాలన్నిటిలో ఎంతో విలువయిన సమాచారాన్ని పొందుపరచడంతో పాటు దాటేస్తే దాగని సత్యాల్ని అనేక ఆసక్తికరమైన అంశాల్ని జోడిరచారు.
డా॥జయధీర్ తిరుమలరావు గరివెళ్లని ఎందుకు విస్మరించాంతో ఆరంభమై ‘భారత స్వాతంత్య్ర పోరాటంలో గరిమెళ్ల పాత్ర’ (రమాసుందరి) తో ముగిసే ఈ సంకలనంలో 21 వ్యాసాలు ఉన్నాయి.
ఈ వ్యాసాల్లో కొన్ని దేశ స్వతంత్ర ఉద్యమానికి సంబంధించిన చారిత్రక విషయాలను వివరిస్తే వర్తమాన దేశ పరిస్థితులను వివరిస్తూ భవిష్యత్తులో మార్పును కోరుకునే వ్యాసాలు కొన్ని. దేశ స్వాతంత్య్ర సాధనలో గాంధీజీ పాత్రను గాంధీ మార్గాన్ని డా॥నాగసూరి వేణుగోపాల్ వ్యాసం విపులీకరిస్తుంది. డా॥పాపినేని శివశంకర్, డా॥సి.హెచ్. సుశీలమ్మ, దివికుమార్, డా॥రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి, డా॥కందిమల్ల సాంబశివరావు, కె.ఎల్.ప్రసాద్ల వ్యాసాలు స్వాతంత్య్ర ఉద్యమంలో దేశభక్తి కవిత్వం, పాట తెచ్చిన చైతన్యం, ప్రజాకళల పాత్ర, స్వరాజ్య భావనను వ్యాప్తి చేసిన నవల నాటకాలకు సంబంధించి తెలుగులో జరిగిన కృషిని విశ్లేషణాత్మకంగా అందిస్తాయి. స్వరాజ్య ఉద్యమంలో స్త్రీల పాత్రను డా॥జంధ్యాల కనకదుర్గ, కుప్పిలి పద్మ వ్యాసాలు, ఉద్యమంలో ఉత్తరాంధ్ర మహిళల పాత్రను డా॥కె.మధుసూదన్ వ్యాసం అక్షరీకరిస్తాయి.
ఫ్రెంచి విప్లవం కారణంగా స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రాతృత్వం అనే విలువల చైతన్యం రావడం, భారత రాజ్యాంగ సభ, అంబేద్కర్ నాయకత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు, రాజ్యాంగంలో విశిష్టమైన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటివి డా॥బి.హరగోపాల్ వ్యాసం ‘భారత రాజ్యాంగంమారుతున్న సందర్భం’ విశదీకరిస్తుంది. ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల గురించి, స్వతంత్ర ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్ల పాత్రను గురించి, కమ్యూనిస్టుల పాత్ర గురించి నందిని సిద్ధారెడ్డి, సయ్యద్ నశీర్ అహ్మద్, తెలకపల్లి రవిల వ్యాసాలు విపులీకరిస్తాయి.ప్రస్తుత దేశ ప్రధాన మంత్రి అంతరంగాన్ని, వ్యూహల్ని, దేశ ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ ఆలోచనలనూ, విధానాలనూ కె.శ్రీనివాస్ వ్యాసం ఆవిష్కరిస్తే తెలుగు పత్రికల ఆవిర్భావాన్ని అవి నిర్వహించిన పాత్రను ప్రస్తావిస్తుంది ఆర్.వి.రామారావు వ్యాసం ‘స్వాతంత్య్రోద్యమంలో తెలుగు పత్రికలు: దశ
దిశ.
స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలయినా రైతు సమస్యలు పరిస్కారం కాలేదు. పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యారంగంలో అర్థంలేని ప్రయోగాలు జరుగు తున్నాయి కాని లోపాలు సరిదిద్దటం లేదు. ఇక ఆరోగ్య వ్యవస్థ ఎంత దయనీయమైన స్థితిలో ఉందో, రోజురోజుకీ ఎంత దిగజారిపోతున్నదో అందరికీ తెలుసు. ఈ అంశాల మీద అట్టాడ అప్పల్నాయుడు, రమేష్ పట్నాయక్, డా॥నళినిల వ్యాసాలు ఆలోచింపచేస్తాయి. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో వర్తమాన పరిస్థితులు ఏమిటి, దిద్దుబాటు చేయవలసినదేమిటి అనే విషయాలు ఈ వ్యాసాలు చర్చిస్తాయి.
ఈ సంపుటిలోని వ్యాసాలన్నీ విస్తృతమైన పరిథిని కలిగి ఉన్నాయి. వ్యాసకర్తలందరూ అనుభవజ్ఞులైన రచయితలు. ప్రస్తుత పరిస్థితుల పట్ల అవగాహన, రాబోయేతరాల భవిష్యత్తు కోసం ఆరాటం ఉన్నవారే. వీరు వ్యాసాల్లో విషయాన్ని సులభంగా గ్రాహ్యం చెయ్యటంతో పాటు ఆసక్తికరంగా చెప్పడంతో ఈ వ్యాస సంపుటికి ‘రీడబిలిటి’ సమకూరింది. కొన్ని పుస్తకాలు చదివి మరచిపోతాం. కొన్నిటిని చాలాకాలం గుర్తుంచుకుంటాం. కొన్నిటిని చదివి గుర్తుంచుకోవడమే కాక ఇతరులను తప్పక చదవమని ప్రోత్సహిస్తాం. అలాంటిదే ఈ అమూల్యమైన వ్యాస సంకలనం. పఠనాసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చదవడమే కాక గృహ గ్రంథాలయంలో భద్రంగా దాచుకోవలసినది ఈ స్వరాజ్య స్ఫూర్తి ఏ 75.