అనుమతి లేదంటూ సమాజ్వాది అధ్యక్షుడు అఖిలేష్యాదవ్ చేపట్టిన ర్యాలీని యూపీ పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళలపై పెరుగుతున్న క్రైమ్ రేటు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపుతప్పడం వంటి పలు సమస్యలను లేవనెత్తుతూ ఈ ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి తీసుకోలేదని, అయినప్పటికీ ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా మరో మార్గంలో వెళ్లాలని సూచించామని జాయింట్ పోలీస్ కమిషనర్ పీయూష్ మోర్డియా తెలిపారు. అయితే అఖిలేష్యాదవ్ నిరాకరించారని, దీంతో ర్యాలీని అడ్డుకోక తప్పలేదని చెప్పారు. విధాన్ భవనానికి వెళ్లే దారిలో బారికేడ్లతో పాటు భారీగా పోలీసులను మోహరించారు. సమాజ్వాది పార్టీ కార్యాలయం నుండి రాజ్భవన్ మీదుగా విధానభవన్ వరకు ర్యాలీ చేపట్టాలని సమాజ్వాది పార్టీ నిర్ణయించిందని.. కానీ పోలీసులు అడ్డుకుని మరో మార్గంలో వెళ్లాల్సిందిగా సూచించారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.