భారత దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ప్రథమ స్థానంలో నిలిపేందుకు తనతో కలిసి రావాలని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్ని పార్టీలను కోరారు. దిల్లీలో మేక్ ఇండియా నెం.1 అనే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పాఠశాలలను నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు పిలుపునిచ్చారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంపై ప్రధాన దృష్టితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు తనతో కలిసి రావాలన్నారు. మేక్ ఇండియా నెంబర్ వన్ మిషన్ ద్వారా దేశంలోని 130 కోట్ల మంది భారతీయులను అనుసంధానం చేస్తామన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిందని, ఈ సమయంలో ఎంతో సాధించామని, అయితే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. ఈ కాలంలో చాలా చిన్న దేశాలు మన కన్నా ముందుకు దూసుకెళ్ళాయనే భావన ఉందని చెప్పారు.