త్వరలో జరగబోయే వార్షిక అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు చేసిన కుట్రను సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) సిబ్బంది భగ్న్రం చేసింది. జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ రహస్య సొరంగాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పెట్రోలింగ్ టీమ్ గుర్తించింది. సాంబా జిల్లాలోని చాక్ ఫఖీరా బోర్డర్ అవుట్పోస్ట్కు సమీపంలోని 150 మీటర్ల పొడవైన సొరంగం ఉన్నట్లు గుర్తించామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఇటీవలే ఈ సొరంగాన్ని తవ్వారని, పాక్ భూభాగం నుంచే మొదలైందని బీఎస్ఎఫ్ డీఐజీ ఎస్పీఎస్ సంధు పేర్కొన్నారు.
అవుట్ పోస్ట్కు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ సొరంగం ఉన్నట్లు తెలిపారు. ఈ సొరంగం నుంచి భారత్లోని చివరి గ్రామానికి దూరం కేవలం 700 మీటర్లేనని చెప్పారు. సుమారు 2 అడుగుల వెడల్పున్న సొరంగం బలోపేతం చేయడానికి ఉపయోగించిన 21 ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. సొరంగం లోపలికి వెళ్లి మరింత లోతుగా పరిశీలిస్తామని సంధు వివరించారు. అమర్నాథ్ యాత్రకు భంగం కలిగించేందుకు పాక్ తీవ్రవాదులు ఈ సొరంగం నుంచి భారత భూభాగంలోకి చొరబడేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల జమ్మూలోని సుంజ్వాన్ ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిఘా మరింత పెంచింది. బీఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇందులో భాగంగానే ఈ టన్నెల్ను గుర్తించారు. దేశంలోకి చొరబాటుకు జైషే మహ్మద్కు ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్ల ఈ సొరంగాన్ని వినియోగించినట్టు భావిస్తున్నారు.
‘అంతర్జాతీయ సరిహద్దు నుంచి 150 మీటర్ల దూరంలో, సరిహద్దు కంచె నుంచి 50 మీటర్ల దూరంలో భారత్వైపు నుంచి 900 మీటర్ల దూరంలో ఉన్న పాక్ పోస్ట్ చమన్ ఖుర్ద్ (ఫియాజ్) ఎదురుగా ఈ సొరంగం కనుగొన్నాం.. భారత్ చిట్టచివరి గ్రామానికి చమన్ ఖుర్ద్కు మధ్య కేవలం 700 మీటర్ల దూరం ఉంది’ అని తెలిపారు. ఈ ఏడాదిన్నరలో సరిహద్దుల వద్ద ఐదు సొరంగాలను గుర్తించామని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ డీకే బూరా అన్నారు. దేశంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు పాక్ దుష్ట పన్నాగం మరోసారి బయటపడిరదని పేర్కొన్నారు.