Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రదాడికి కుట్ర..రహస్య సొరంగం గుర్తింపు

త్వరలో జరగబోయే వార్షిక అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు చేసిన కుట్రను సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది భగ్న్రం చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ రహస్య సొరంగాన్ని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) పెట్రోలింగ్‌ టీమ్‌ గుర్తించింది. సాంబా జిల్లాలోని చాక్‌ ఫఖీరా బోర్డర్‌ అవుట్‌పోస్ట్‌కు సమీపంలోని 150 మీటర్ల పొడవైన సొరంగం ఉన్నట్లు గుర్తించామని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. ఇటీవలే ఈ సొరంగాన్ని తవ్వారని, పాక్‌ భూభాగం నుంచే మొదలైందని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ఎస్‌పీఎస్‌ సంధు పేర్కొన్నారు.
అవుట్‌ పోస్ట్‌కు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ సొరంగం ఉన్నట్లు తెలిపారు. ఈ సొరంగం నుంచి భారత్‌లోని చివరి గ్రామానికి దూరం కేవలం 700 మీటర్లేనని చెప్పారు. సుమారు 2 అడుగుల వెడల్పున్న సొరంగం బలోపేతం చేయడానికి ఉపయోగించిన 21 ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. సొరంగం లోపలికి వెళ్లి మరింత లోతుగా పరిశీలిస్తామని సంధు వివరించారు. అమర్‌నాథ్‌ యాత్రకు భంగం కలిగించేందుకు పాక్‌ తీవ్రవాదులు ఈ సొరంగం నుంచి భారత భూభాగంలోకి చొరబడేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల జమ్మూలోని సుంజ్వాన్‌ ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్‌ బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిఘా మరింత పెంచింది. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇందులో భాగంగానే ఈ టన్నెల్‌ను గుర్తించారు. దేశంలోకి చొరబాటుకు జైషే మహ్మద్‌కు ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు సూసైడ్‌ బాంబర్ల ఈ సొరంగాన్ని వినియోగించినట్టు భావిస్తున్నారు.
‘అంతర్జాతీయ సరిహద్దు నుంచి 150 మీటర్ల దూరంలో, సరిహద్దు కంచె నుంచి 50 మీటర్ల దూరంలో భారత్‌వైపు నుంచి 900 మీటర్ల దూరంలో ఉన్న పాక్‌ పోస్ట్‌ చమన్‌ ఖుర్ద్‌ (ఫియాజ్‌) ఎదురుగా ఈ సొరంగం కనుగొన్నాం.. భారత్‌ చిట్టచివరి గ్రామానికి చమన్‌ ఖుర్ద్‌కు మధ్య కేవలం 700 మీటర్ల దూరం ఉంది’ అని తెలిపారు. ఈ ఏడాదిన్నరలో సరిహద్దుల వద్ద ఐదు సొరంగాలను గుర్తించామని బీఎస్‌ఎఫ్‌ జమ్మూ ఐజీ డీకే బూరా అన్నారు. దేశంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు పాక్‌ దుష్ట పన్నాగం మరోసారి బయటపడిరదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img