క్రైంబ్రాంచ్ కార్యాలయానికి తరలింపు
లఖింపూర్ ఖేరి(యూపీ) : వ్యవసాయ ‘నల్ల’ చట్టాల రద్దు కోరుతూ నిరసన చేస్తున్న రైతులను వాహనంతో ఢీకొట్టి వారి మరణానికి కారణమైన కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు మంగళవారం క్రైంబ్రాంచ్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. కోర్టు అతనిని మూడు రోజుల కస్టడీకి పంపిన ఒకరోజు తర్వాత ఈ విచారణ చేపట్టినట్లు అధికారి ఒకరు తెలిపారు. అయితే విచారణ సమయంలో అశిష్ను వేధించరాదని, అతని న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలన్న షరతుతో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చింతారామ్ సోమవారం మూడు రోజుల పోలీసు రిమాండ్ మంజూరు చేశారు. అక్టోబరు 3న నలుగురు రైతులతో సహా ఎనిమిది మృతికి కారణమైన లఖింపూర్ ఖేరి హింసాకాండ కేసుకు సంబంధించి శనివారం రాత్రి అతనిని అరెస్టు చేశారు. అశిష్ను 14 రోజుల రిమాండ్కు పోలీసులు డిమాండ్ చేశారు. కానీ అక్టోబరు 12న ప్రారంభమైన మూడు రోజులు కొనసాగుతుంది. అక్టోబరు 15న ముగుస్తుందని సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్(ఎస్పీవో) ఎస్.పి.యాదవ్ విలేకరులకు తెలిపారు. ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయడానికి ముందు శనివారం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో 12 గంటల పాటు విచారణ జరిపారు. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అతడిని విచారణ చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. అక్టోబర్ 3న ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనపై నిరసన వ్యక్తం చేస్తున్న నలుగురు రైతులను వాహనంతో తొక్కించిన ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో అశిష్ మిశ్రా పేరు నమోదయింది.