అసోంలో జేఈ వ్యాధి విజృంభిస్తోంది. దోమల కారణంగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. ఇప్పటి వరకు 160 కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారిన పడిన వారిలో 23 మంది చనిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయం చేసే ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అసోంలో ఇటీవల వరదలు ముంచెత్తాయి. చాలా ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. దాంతో దోమలు పెరిగి ఈ వ్యాధి పెరుగుతుందని వైద్యాధికారులు అంచనా వేశారు. కేవలం 15 రోజుల్లో కనీసం 23 మంది చనిపోయినట్టు జాతీయ ఆరోగ్య మిషన్ తన నివేదికలో పేర్కొంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 16 జేఈ కొత్త కేసులు బయటపడగా.. నలుగురు చనిపోయారు. ఈ రోగం బారిన పడి నల్బరీ, మోరిగావ్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. బార్పేట, కమ్రూప్ మెట్రో పాలిటన్, కర్బీ అంగ్లాంగ్ ఈస్ట్, హోజాయ్లో ఒక్కో కేసు నమోదు కాగా.. నాగావ్లో నాలుగు, శివసాగర్లో రెండు, నల్బరీ, ఉదల్గురి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటితో జూలై 1 నుంచి అసోంలో మొత్తం 160 జేఈ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు.