ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని కొన్ని ప్రాంతాలు అతాలకుతలమవుతున్నాయి. భాగ్సు ప్రాంతంలో రోడ్లు జలమయమయ్యాయి. ఆకస్మిక వరదలకు కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని హోటళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానికులు ఈ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియోలు వైరల్గా మారాయి.. గత కొన్ని రోజులుగా హిమాచల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా మాంగీ నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వరద తీవ్రత మరింత పెరగడంతో నది పోటెత్తింది దీంతో ప్రఖ్యాత బౌద్ధ పుణ్యక్షేత్రం ధర్మశాల నీటితో నిండిపోయింది. భాగ్సు నాగ్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రానున్న రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్తో పాటు ఉత్తరభారత్లోని చాలా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పిడుగులు పడి 68 మంది మృతి చెందారు.