తిరువనంతపురం : ఆధ్యాత్మిక నేతలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, తమ ప్రసంగాల ద్వారా సమాజంలో విభజనలు సృష్టించకూడదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరించారు. కాథలిక్కులు, ముస్లిమేతరులను మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చేందుకు ముస్లిం మతపెద్దలు కుట్ర పన్నుతున్నారని పాలాకి చెందిన ఒక బిషప్ వ్యాఖ్యానించడం కేరళలో దుమారం రేగుతోంది. లవ్ జిహాద్ తరహాలో నార్కోటిక్ జిహాద్లను ప్రోత్సహిస్తున్నారని ఆ బిషప్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై విజయన్ స్పందిస్తూ బిషప్ అంటే ప్రభావితం చేయగలిగిన, సమూలంగా నేర్చుకున్న వ్యక్తి అని అన్నారు. వారు సమాజంలో గౌరవం కలిగి ఉంటారని తెలిపారు. వారు వివాదాలను సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తుల మాటలు, చేతలు మతపరమైన వివాదాలకు దారితీసేవిధంగా ఉండకూడదని హితవు పలికారు.