న్యూదిల్లీ : ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కె.కరాద్ సోమవారం చెప్పారు. ఆరోగ్యబీమా ప్రీమియంపై జీఎస్టీ లేవీ 18శాతం వసూలు చేస్తున్నట్లు మంత్రి భగవత్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం చెప్పారు. జీఎస్టీ మండలి సిఫార్సుల ఆధారంగానే జీఎస్టీ రేటుపై నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. జీఎస్టీ మండలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సభ్యులు ఉంటారని చెప్పారు. ప్రస్తుతానికి జీఎస్టీ మండలి దీనిపై ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. వ్యాపార ప్రాతిపదికన ఆరోగ్య బీమాను విస్తరిస్తున్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజారోగ్యమనేది రాష్ట్రానికి సంబంధించిన అంశమని, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిక కార్యక్రమాలుగా ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. వీటిని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల్సిందిగా కోరామన్నారు.